ముంబై: ఒలింపిక్స్ అథ్లెటిక్స్లో ఇండియా తరఫున తొలి గోల్డ్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ( Neeraj Chopra ).. కౌన్ బనేగా కరోడ్పతి ప్రోగ్రామ్కు స్పెషల్ గెస్ట్గా వచ్చాడు. అతనితోపాటు బ్రాంజ్ మెడల్ గెలిచిన హాకీ టీమ్ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ కూడా ఉన్నాడు. షాన్దార్ శుక్రవార్ పేరుతో శుక్రవారం రాత్రి ఈ స్పెషల్ ప్రోగ్రామ్ టెలికాస్ట్ కానుంది. ఈ ప్రోగ్రామ్లో ఈ ఇద్దరు అథ్లెట్లను ఆహ్వానిస్తూ షో హోస్ట్, బాలీవుడ్ షెహన్షా అమితాబ్ బచ్చన్ చాలా గొప్పగా పరిచయం చేశాడు. దీనికి సంబంధించిన ప్రోమో రిలీజైంది.
అయితే ఈ సందర్భంగా ఆ ఇద్దరితో అమితాబ్ మాట్లాడుతూ.. మిమ్మల్ని ఓ ప్రశ్న అడగొచ్చా? ఈ మెడల్ను నేను టచ్ చేయొచ్చా అని అడిగాడు. వెంటనే ఆ ఇద్దరూ తమ మెడల్స్ను బిగ్ బీ చేతుల్లో పెట్టారు. దీనికి బిగ్ బీ స్పందిస్తూ.. లేదు, లేదు నేను దీనిని మెడలో వేసుకోను అని అన్నాడు. వాటిని చేతుల్లోకి తీసుకుంటూ.. ఇవి చాలా బరువున్నాయి, బాగున్నాయి అని అమితాబ్ చెప్పాడు. నా జీవితంలో ఇలాంటివి వేసుకునే అవకాశం దొరకదు. వీటిని చేత్తో తాకితే చాలు.. మాకు అదే ఎక్కువ అని కూడా అతడు అనడం విశేషం.
ఈ ప్రోగ్రామ్ చాలా సరదాగా సాగినట్లు ఇంతకుముందు ప్రోమో చూస్తే తెలుస్తోంది. తన మూవీ డైలాగ్లను హర్యాన్వీలోకి తర్జుమా చేసి చెప్పాలని బిగ్ బీ కోరితే.. నీరజ్ అలాగే చేసి నవ్వించాడు. అంతేకాదు సెట్స్లోనే జావెలిన్ ఎలా విసరాలో, హాకీ ఎలా ఆడాలో ఈ ఇద్దరి నుంచీ మెళకువలు నేర్చుకున్నాడు. ఓ గోల్ కూడా కొట్టాడు. ఇక ఈ ప్రోగ్రామ్ ద్వారా నీరజ్ చోప్రా.. తన సక్సెస్ స్టోరీని వివరించాడు.