న్యూఢిల్లీ: క్రీడల్లో అత్యున్నత పురస్కారం రాజీవ్గాంధీ ఖేల్రత్న పేరును ఇక నుంచి మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న అవార్డుగా మారుస్తున్నట్లు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని దేశమంతా స్వాగతించింది. ఓ స్పోర్ట్స్ అవార్డుకు స్పోర్ట్స్ వాళ్ల పేర్లే పెట్టడం సరైనదంటూ ప్రముఖులతోపాటు క్రీడాభిమానులు కూడా అభిప్రాయపడ్డారు. అయితే అదే సమయంలో ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా పేరుగాంచిన అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియాన్ని తెరపైకి తెస్తున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ మొతెరా స్టేడియంగా ఉన్న దీని పేరును కొత్తగా ప్రారంభించిన తర్వాత నరేంద్ర మోదీ స్టేడియంగా మార్చిన సంగతి తెలుసు కదా.
ఇదే విషయాన్ని ఇప్పుడు ట్విటర్ యూజర్లు లేవనెత్తుతున్నారు. స్పోర్ట్స్ అవార్డులకు స్పోర్ట్స్ వాళ్ల పేర్లు బాగానే ఉంది.. కానీ భవిష్యత్తులో స్టేడియాలకు కూడా స్పోర్ట్స్ వాళ్ల పేర్లు పెడితే బాగుంటుంది అని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేయడం విశేషం. ఇక యూట్యూబర్ ధృవ్ రాఠీ ట్వీట్ చేస్తూ.. నరేంద్ర మోదీ, జైట్లీ స్టేడియాల పేర్లూ మార్చండి. అసలు రాజకీయ నాయకుల పేర్లను తీసేయండి అని ట్వీట్ చేశాడు. గుజరాత్ ప్రతిపక్ష నేత శంకర్సిన్హ్ వాఘేలా కూడా దీనిపై స్పందించారు. మోదీ స్టేడియాన్ని సర్దార్ పటేల్ స్టేడియంగా మార్చాలని అడిగారు.