మా వద్ద పెట్టుబడి పెట్టు.. జాక్ పాటు కొట్టు.. అంటూ ఓ మహిళ ఫోన్ చేయగానే వెనుకాముందు ఆలోచించకుండా ఓ యువకుడు దఫదఫాలుగా రూ.1.30లక్షలు పెట్టుబడిగా పెట్టి మోసపోయాడు. శ్రీనగర్కాలనీకి చెందిన యువకుడు ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. గతంలో ఇంటర్నెట్ ద్వారా క్లిక్ ప్రో మీడియా లిమిటెడ్ సంస్థ గురించి తెలుసుకున్నాడు. ఈ సంస్థలో పెట్టుబడి పెడితే ప్రతి నెల 10శాతం వడ్డీ వస్తుందని నమ్మించారు. వాళ్ల మాటలు నమ్మిన బాధితుడు రూ.10 వేలు డిపాజిట్ చేశాడు. వెంటనే యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవ్వడంతో పాటు మై క్లిక్ బ్యాంక్ యాప్లోకి ఎంట్రీ చేయించారు. ఎంట్రీ కాగానే రూ.5600 బాధితుడి ఖాతాలో జమ అయినట్లు చూపించాయి. కాగా ఇటీవల సంస్థ ప్రతినిధులమంటూ ఫోన్ చేసిన మహిళ వరుసగా సెలవులు వస్తుండటంతో వీఐపీ గోల్డ్ కార్డ్ సభ్యుడిగా ఆఫర్ ఇస్తున్నామని బాధితుడికి చెప్పింది.
ఇందులో రూ.40 వేలు పెట్టుబడి పెడితే 20శాతం లాభాలతో పాటు ప్రత్యేక బోనస్లు ఉంటాయంటూ చెప్పడంతో రూ.40 వేలు డిపాజిట్ చేశాడు. ఆ తరువాత రూ.50 వేలు చెల్లిస్తే ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయని ఏప్రిల్ 19తో ఈ ఆఫర్ ముగుస్తుందని చెప్పడంతో మరో సారి రూ.50 వేలు డిపాజిట్ చేశాడు. అంతలోనే మరో ఆఫర్ ఇవ్వడంతో రూ.30వేలు డిపాజిట్ చేశాడు. అయితే అప్పటి వరకు యాప్లోని బాధితుడి ఖాతాలో ఎప్పటికప్పుడు వచ్చిన లాభాలు కన్పించాయి. బుధవారం నుంచి ఆ యాప్ పనిచేయడం లేదు. ఫోన్ చేస్తే ఎవరూ స్పందించకపోవడంతో తాను మోసపోయానని గుర్తించిన బాధితుడు, సీసీఎస్ సైబర్క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.