రెండు దశాబ్దాల క్రితం సిడ్నీ ఒలింపిక్స్లో తెలుగు తేజం కరణం మల్లీశ్వరి పతకం పట్టిన తర్వాత.. లిఫ్టింగ్లో భారత్కు మరో పతకం దక్కలేదు. ఈ సుదీర్ఘ నిరీక్షణకు ఫుల్స్టాప్ పెట్టేందుకు స్టార్ లిఫ్టర్ మీరాబాయి చాను సిద్ధమవుతున్నది.
–నమస్తే తెలంగాణ క్రీడావిభాగం
రియో ఒలింపిక్స్లో స్వర్ణం నెగ్గిన థాయ్లాండ్ లిఫ్టర్ సోపిట తానాసన్ 200 కేజీల బరువుతో స్వర్ణం జిక్కించుకోగా.. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్లో రెండో స్థానంలో ఉన్న చాను 205 కేజీల కెరీర్ బెస్ట్ నమోదు చేసుకుంది.
మణిపూర్లోని మారుమూల గ్రామంలో పుట్టిన సైఖోమ్ మీరాబాయి చాను.. చిన్న వయసులో తన అన్నదమ్ములు మోయలేని బరువైన కట్టెల మోపులను అలవోకగా ఎత్తి తల్లిదండ్రులను ఆశ్చర్యపరిచేది. అది గుర్తించిన కోచ్లు ఆమెను లిఫ్టింగ్ వైపు ప్రోత్సహించగా.. పన్నేండేండ్ల ప్రాయంలో బరువెత్తడాన్ని బాధ్యతగా తీసుకుంది. ఇక అక్కడి నుంచి అనేక కష్టనష్టాలకు ఓర్చి అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. 2014 గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో రజతం పట్టిన చాను.. రియో (2016) ఒలింపిక్స్ బరిలో దిగినా.. మూడు ప్రయత్నాల్లోనూ బరువు ఎత్తడంలో విఫలమై నిరాశగా వెనుదిరిగింది. అయితే గోడకు కొట్టిన బంతిలా తిరిగి పుంజుకున్న చాను.. 2017 ప్రపంచ చాంపియన్షిప్లో స్వర్ణం నెగ్గి శెభాష్ అనిపించుకుంది. ఆ తర్వాతి ఏడాది గోల్డ్కోస్ట్ కామన్వెల్త్ క్రీడల్లో 196 కేజీల బరువుతో పసిడి కైవసం చేసుకుంది. 2019 ఆసియా చాంపియన్షిప్లో 199 కేజీల బరువెత్తిన చాను.. ప్రపంచ చాంపియన్షిప్లో 201 కేజీలు ఎత్తి పడేసింది. టోక్యో ఒలింపిక్స్లో భారత్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక లిఫ్టర్ అయిన చాను.. స్థాయికి తగ్గ ప్రదర్శన కొనసాగిస్తే.. విశ్వక్రీడల చరిత్రలో భారత్ ఖాతాలో రెండో పతకం చేరడం ఖాయంగానే కనిపిస్తున్నది. 48 కేజీల విభాగంలో బరిలోకి దిగుతున్న ఈ మణిపూర్ రత్నం.. కరణం మల్లీశ్వరి (2000 సిడ్నీ- కాంస్యం) తర్వాత ఆ జాబితాలో తన పేరు లిఖించుకునేందుకు తహతహలాడుతున్నది.