ముంబై: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడుతున్న ఆస్ట్రేలియా ప్లేయర్స్ టోర్నీ ముగిసిన తర్వాత ఇంటికెళ్లాలా అన్న ఆలోచనలో పడ్డారు. ఇప్పటికే కొంత మంది భయపడి.. ఇండియా విమానాలపై ఆస్ట్రేలియా నిషేధం విధించక ముందే వెళ్లిపోయారు. ఇంకొందరు వేరే దారి లేక ఇక టోర్నీ ముగిసే వరకూ ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆ తర్వాత కూడా పరిస్థితి ఇలాగే ఉంటే ఏంటన్న ఆందోళన కొందరిలో కనిపిస్తోంది. ఓ చార్టర్డ్ విమానాన్ని పంపించాలన్న క్రిస్ లిన్ రిక్వెస్ట్ను ఆస్ట్రేలియా ప్రధాని తోచి పుచ్చారు. మీరే ఎలాగోలా రావాల్సిందేనని స్పష్టం చేశారు.
అయితే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్వెల్ దగ్గర దీనికి సంబంధించిన ప్లాన్ ఇప్పటికే రెడీగా ఉంది. టోర్నీ ముగియగానే ఇండియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్ ప్లేయర్స్తో కలిసి తాము కూడా యూకే వెళ్లిపోతామని, అక్కడి నుంచి ఆస్ట్రేలియా వెళ్లడం ఈజీ అని మ్యాక్స్వెల్ చెప్పాడు. వీళ్లను ఎలాగూ చార్టర్డ్ విమానంలో తీసుకెళ్తారు. వాళ్లతో పాటే ఆసీస్ ప్లేయర్స్ను తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నట్లు బీసీసీఐ అధికారి కూడా చెప్పడం విశేషం.
ఏదో రకంగా ఇంటికి వెళ్తే చాలు. బీసీసీఐ, రెండు ప్రభుత్వాలు దీనికి ఓ పరిష్కారం చూపిస్తాయి. టోర్నీ ముగిసిన తర్వాత కూడా కొన్ని రోజులు వేచి చూడమంటే చూస్తాం. కానీ ఆ తర్వాతైనా ఇంటికి వెళ్లే దారి ఉంటే చాలు అని మ్యాక్స్వెల్ అన్నాడు. ఇండియా, ఇంగ్లండ్ ఎలాగూ ఇంగ్లండ్ వెళ్తున్నాయి. వాళ్లతోపాటు వెళ్లి ఇంగ్లండ్లో కొన్ని రోజులు ఉంటాము. ఈ ప్లాన్కు మిగతా ప్లేయర్స్ కూడా సిద్ధంగానే ఉన్నారు అని మ్యాక్స్వెల్ చెప్పాడు.
ఇండియా, ఇంగ్లండ్తోపాటు న్యూజిలాండ్ ప్లేయర్స్ కూడా ఇంగ్లండ్ వెళ్లనున్నారు. జూన్ 18 నుంచి అక్కడ ఇండియా, న్యూజిలాండ్ మధ్య వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ జరగనుంది. దీంతో ఈ మూడు టీమ్స్తోపాటు ఆస్ట్రేలియా వాళ్లను కూడా పంపిస్తే బాగానే ఉంటుందని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ అన్నారు.