డిమాండ్ ఉండడంతో రైతుల్లో ఆసక్తి
రూరల్ జిల్లాలో 380 ఎకరాల్లో సాగు
అనుకూలిస్తున్న నల్లరేగడి నేలలు
ప్రస్తుతం చేతికందే దశలో తెల్లజొన్నలు
సహజంగా మాగిజొన్నను వర్షాకాలంలో సాగు చేస్తారు. కానీ, ఈ సారి జిల్లాలోని అన్ని చెరువులు, కుంటల్లో నీరు సమృద్ధిగా ఉండడంతో రైతులు ఈ పంట సాగుపై దృష్టిపెట్టారు. వరంగల్ రూరల్ జిల్లాలో సుమారు 380 ఎకరాల్లో తెల్లజొన్న సాగు చేశారు. తేలికపాటి ఎర్రనేలలు, నల్లరేగడి నేలలు చాలా ఈ పంట సాగుకు అనుకూలమైనవి. గత వానకాలంలో కురిసిన వర్షాలకు నల్లరేగడి నేలలు వర్షపు నీటిని బాగా పీల్చుకున్నాయి. చలికాలంలో కూడా ఈ నేలలు నిమ్ముగానే ఉంటాయి. ఈ తేమతోనే మాగిజొన్న పంట సాగు చేయవచ్చు. తేలికపాటి నేలలైతే సూటి రకాలు(అధిక చొప్ప, గింజనిచ్చే రకాలు) ఎంచుకోవడం మంచిదని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. విత్తనాలు ఎకరానికి 3 నుంచి 4 కిలోలు సరిపోతాయి.
విత్తన శుద్ధి ముఖ్యం..
జొన్న పంట వేసే ముందు విత్తన శుద్ధి చాలా ముఖ్యం. పంటను మొవ్వు ఈగ బారి నుంచి కాపాడుకునేందుకు ఒక కిలో విత్తనానికి మూడు గ్రాముల థయోమిథాక్సామ్, 70శాతం డబ్ల్యూఎస్ లేదా 12 మి.లీ.ల ఇమిడాక్లోప్రిడ్ 48 ఎఫ్ఎస్ కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి. నడిచే గొర్రుతో వరుసల మధ్య 45సెం.మీ వ్యవధి, మొక్కల మధ్య 12-15 సెం.మీ దూరంలో విత్తనాలు వేయాలి. ఎకరాకు 60వేల నుంచి 74వేల వరకు మొక్కలు నాటుకోవచ్చు. పంట వేసే ముందు ఎకరానికి 3-4టన్నుల పశువుల ఎరువు వేసి ఆఖరి దుక్కిలో కలియదున్నాలి. ఖరీఫ్లో వర్షాధారంగా సాగు చేసినప్పుడు ఎకరాకు 24కిలోల నత్రజని, 12కిలోల భాస్వరం, ఎనిమిది కిలోల పొటాషియం ఎరువులను వేయాలి. రబీలో మాత్రం నీటి పారుదల కింద సాగు చేసినప్పుడు ఎకరాకు 40కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 16కిలోల పొటాష్ ఎరువులు వాడాలి. నత్రజని ఎరువులు సగభాగం విత్తేముందు, మిగతా సగం పైరు 30-35 రోజల దశలో ఉన్నప్పుడు వేసుకోవాలి.
కోత దశకు వచ్చిన పంట..
ప్రస్తుతం జిల్లాలో జొన్న పంట కోత దశలో ఉంది. కంకి కింది వరుసలో ఉన్న గింజలు ఆకుపచ్చ రంగు నుంచి తెల్లగా మారి గింజలో ఉన్న పాలు ఎండిపోయి, నల్లటి చార ఏర్పడిన తర్వాత పంటను కోయాలి. గింజల్లో తేమ 9-10శాతం ఉండేలా ఎండబెట్టుకొని ఆ తర్వాత గోనె సంచుల్లో నింపాలి. జొన్నచొప్ప కూడా పశువులకు పశుగ్రాసంగా ఉపయోగపడుతుంది.
ఇవి కూడా చూడండి..
మద్యం సేవించి వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి డ్యాన్స్ చేసిన వ్యక్తి
రైతు నేత రాకేశ్ టికయిత్ కాన్వాయ్పై దాడి