ఎన్ని మ్యాచ్లు నెగ్గినా.. ఎన్ని సిరీస్లు చేజిక్కించుకున్నా.. ఐసీసీ ట్రోఫీ హస్తగతం చేసుకుంటే వచ్చే కిక్కే వేరు! ప్రపంచ అత్యుత్తమ ఆటగాడిగా మన్ననలు అందుకుంటున్న విరాట్ కోహ్లీ.. జట్టు పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఎన్నో అద్భుత విజయాలు ఖాతాలో వేసుకున్నా.. ఐసీసీ ట్రోఫీ మాత్రం అతడికి అందని ద్రాక్షలాగే ఊరిస్తున్నది. ఇటీవలి కాలంలో టెస్టుల్లో తిరుగులేని శక్తిగా ఎదిగిన టీమ్ఇండియా.. ఐసీసీ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన డబ్ల్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్తో తలపడేందుకు రెడీ అవుతున్నది. చాన్నాళ్లుగా ఊరిస్తున్న ట్రోఫీ చేజిక్కించుకోవాలని కోహ్లీసేన కసి మీదుంటే.. ఫైనల్ ఫోబియాను దాటి ముందడుగేయాలని కివీస్ పట్టుదలతో ఉంది! ఈ నేపథ్యంలో ఇరు జట్ల ప్రయాణంపై ఓ కన్నేస్తే..
సుదీర్ఘ ఫార్మాట్కు పూర్వవైభవం తెచ్చేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) రెండేండ్ల క్రితం ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)ను ప్రారంభిస్తే.. కప్పు కొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్న టీమ్ఇండియా అప్రతిహత విజయాలతో ఫైనల్కు దూసుకొచ్చింది. వెస్టిండీస్ను వారి గడ్డపైనే చిత్తుచేయడంతో ప్రారంభమైన కోహ్లీసేన జైత్రయాత్ర.. ఆ తర్వాత దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్లపై విజయాలతో సాఫీగా సాగింది. వరుసగా మూడు సిరీస్లు నెగ్గిన భారత్.. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడం పక్కా అనుకుంటున్న దశలో న్యూజిలాండ్ చేతిలో మనవాళ్లకు సిరీస్ పరాజయం ఎదురైంది. అయినా అక్కడి నుంచి తిరిగి కోలుకున్న టీమ్ఇండియా.. కంగారూ గడ్డపైనే ఆస్ట్రేలియాను ఓడించి చరిత్రాత్మక సిరీస్ విజయం సాధించడంతో పాటు డబ్ల్యూటీసీ పాయింట్లను మెరుగు పర్చుకుంది. ఇక చివరగా స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన సిరీస్లో బెబ్బులిలా విజృంభించిన కోహ్లీసేన 3-1తో సిరీస్ హస్తగతం చేసుకొని దర్జాగా ఫైనల్ చేరింది. తుదిపోరుకు అర్హత సాధించే క్రమంలో న్యూజిలాండ్ చేతిలో మాత్రమే ఓడిన కోహ్లీసేన.. ఇప్పుడదే కివీస్తో ఫైనల్ ఫైట్లో తలపడనుంది. మరోవైపు ఆసీస్ చేతిలో పరాజయం తర్వాత వరుసగా భారత్, వెస్టిండీస్, పాకిస్థాన్పై విజయాలతో విలియమ్సన్ బృందం తుదిపోరుకు చేరింది.
ఎలా చేరాయంటే..
భారత్
వెస్టిండీస్పై 2-0తో విజయం
దక్షిణాఫ్రికాపై 3-0తో గెలుపు
బంగ్లాదేశ్పై 2-0తో జయభేరి
న్యూజిలాండ్ చేతిలో 0-2తో ఓటమి
ఆస్ట్రేలియాపై 2-1తో విజయం
ఇంగ్లండ్పై 3-1తో గెలుపు
న్యూజిలాండ్
శ్రీలంకతో (1-1) సిరీస్ డ్రా
ఆస్ట్రేలియా చేతిలో 0-3తో పరాజయం
భారత్పై 2-0తో విజయం
వెస్టిండీస్పై 2-0తో గెలుపు
పాకిస్థాన్పై 2-0తో విజయం