చెన్నై : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మహిళలను ఉద్దేశించి డీఎంకే అభ్యర్థి దిండిగల్ లియోని చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. మహిళలను ఆవులతో పోల్చిన లియోని విదేశీ ఆవులు ఇచ్చే పాలను తాగి వారు పీపాల్లా తయారవుతున్నారని వ్యాఖ్యానించారు. వివాదస్పద వ్యాఖ్యలతో కూడిన ఆయన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో నెటిజన్లు లియోనిని చెడుగుడు ఆడారు. ‘మహిళలు ఇప్పుడు విదేశీ ఆవుల పాలు తాగడంతో వారి శరీరంలో అదనపు కిలోలు వచ్చిచేరుతున్నాయి..దీంతో వారు షేప్ కోల్పోయి పీపాలా తయారవుతున్నార’ని వ్యాఖ్యానించారు. మహిళలపై అభ్యంతరకరంగా మాట్లాడుతున్న దిండిగల్ లియోనిని పార్టీ నేత వారిస్తున్నా ఆయన తనదైన శైలిలో చెలరేగారు.
డీఎంకే నేత వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఇలాంటి నేతలపై వేటు వేయాలని డీఎంకే అగ్రనేతలకు సూచించారు. లియోని వ్యాఖ్యలు సిగ్గుచేటని బీజేపీ నేత గాయత్రి రఘురామ్ ఆక్షేపించారు. మహిళలపై నిస్సిగ్గుగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఆయన ఏం పాలు తాగుతారని ప్రశ్నించారు. గర్భం దాల్చిన అనంతరం మహిళ శరీరంలో ఏం జరుగుతుందో ఆయనకు తెలుసా..? హార్మోన్ల మార్పుల ప్రభావంపై అవగాహనా ఉందా..? అని నిలదీశారు. మరోవైపు బీజేపీ బెంగాల్ చీఫ్ దిలీప్ ఘోష్ గతంలో చేసిన వ్యాఖ్యలను కొందరు తాజాగా వైరల్ చేస్తున్నారు. దేశీ ఆవులు మన తల్లి లాంటివయితే విదేశీ ఆవులు మన ఆంటీల వంటివని ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నేతల నోటిదురుసు, అనుచిత వ్యాఖ్యలపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.