ముంబై: మహారాష్ట్రలో మహా వికాస్ కూటమి ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తే బీజేపీ ఇక వందేండ్లయినా అధికారంలోకి రాదని శివసేన సీనియర్ నాయకుడు, ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర అధికార కూటమిలో భాగస్వామిగా ఉన్న ఎన్సీపీ అధినేత శరద్పవార్తో ప్రతిపక్ష బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భేటీ గురించి విలేకరులు ప్రస్తావించడంతో రౌత్ పై వ్యాఖ్యలు చేశారు.
అయితే, పవార్తో తన భేటీపై దేవేంద్ర ఫడ్నవీస్ ఇప్పటికే స్పందించారు. తాను కేవలం మర్యాదపూర్వకంగానే ఆయనను కలిశానని, ఈ భేటీకి, రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. అయినా రాష్ట్రంలో కొత్త కూటమి ఏర్పాటు కాబోతున్నదన్న ఊహాగానాలు వెల్లువెత్తాయి. ఈ విషయాన్ని మీడియా ప్రతినిధులు సంజయ్ రౌత్ దగ్గర ప్రస్తావించగా ఆయన స్పందించారు.
ప్రతి భేటీని రాజకీయ కోణంలో చూడొద్దని చెప్పారు. ఆ భేటీలో మంచి ప్రతిపక్ష నేత ఎలా ఉండాలనే విషయంలో ఫడ్నవీస్కు శరద్పవార్ సలహాలు ఇచ్చి ఉంటారని చమత్కరించారు. ఒకవేల ఫడ్నవీస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకే గనుక పవార్తో భేటీ అయ్యి ఉంటే ఇకపై వందేండ్లయినా ఆ పార్టీ మహారాష్ట్రలో అధికారంలోకి రాదన్నారు. మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్లో ఆపరేషన్ కమలం పనిచేయదని చెప్పారు.