భయం వీడుదాం..వైరస్ను జయిద్దాం
లక్షణాలు ఉంటే ఆందోళన వద్దు
99 శాతం మంది కరోనా నుంచి కోలుకుంటున్నారు
ఇతర అనారోగ్య సమస్యలు,ఆందోళనతోనే ప్రాణం మీదకి
అందుబాటులో మెరుగైన వైద్యం..
సద్వినియోగం చేసుకోవాలంటున్న డాక్టర్లు
నిర్మల్ అర్బన్, మే 6 :భయం ఎంతటి బలవంతుడినైనా బూడిద చేస్తుంది. భయానికి ఉన్న గొప్పతనం అదే.. ప్రస్తుతం కరోనా విషయంలో సైతం అదే జరుగుతుందని వైద్యులు, మానసిక నిపుణులు అంటున్నారు. మనలో ఉన్న భయం వైరస్ను చంపివేయకుండా రెట్టింపు స్థాయి రోగాన్ని పెంచుతుందని, దీంతో ఉన్న ఒక్క వ్యాధితో ఇతర అనారోగ్య సమస్యలు సైతం తోడవుతాయని చెబుతున్నారు. కొంత మంది కొవిడ్ రోగులు వైరస్ భయంతో ఇబ్బందులకు గురవుతున్నారంటే, దీనికి తోడు సామాజిక మాధ్యమాల్లో వచ్చే అసత్యపు సమాచారంతో భయానికి మరింత ఆజ్యంపోస్తూ ప్రజల ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా ప్రశ్నార్థకంలో పడేస్తున్నది.ఇటు సాధారణ ప్రజలతో పాటు, అటు కొవిడ్ రోగులు సైతం ఇబ్బందులకు గురవుతున్నారు.
ఆందోళన వద్దు
జిల్లాలోని 23 ప్రాథమిక కేంద్రాల్లో ఉచితంగా పరీక్షలు చేస్తున్నారు. రోజుకు సగటు 3వేల మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొవిడ్ లక్షణాలు ఉంటే ఆందోళన చెందకుండా ప్రభుత్వం అందించిన మందులు వాడితే 15 రోజుల్లో ప్రజలు వైరస్ నుంచి కోలుకుంటున్నారు.
99 శాతం మంది కోలుకుంటున్నారు
జిల్లాలో కరోనా బారిన పడిన ప్రజల్లో 100 మందిలో 99 శాతం మంది త్వరగా కోలుకుంటున్నారు. ఒక శాతం ప్రజలు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్న వారు టీకాలు తీసుకోని వారు మాత్రమే కోలుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం సూచించిన కోవిడ్ నిబంధనలను పాటిస్తే వైరస్ బారిన పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. జిల్లాలో అనేక మంది కొవిడ్ బారిన పడిన వృద్ధులు, చిన్నారులు సైతం వేగంగా కోలుకున్న వారు ఎందరో ఉన్నారు.
ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్యం..
కొవిడ్ బాధితులు దాదాపు హోం ఐసొలేషన్లోనే కోలుకుంటున్నారు. ఇతర అనారోగ్య సమస్యలు ఉన్న వారు ప్రాణాల మీదుకు వచ్చే వరకు ఇంట్లో కూర్చోకుండా దవాఖానలను సద్వినియోగం చేసుకుంటే ఫలితం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం సర్కారు దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నది. ఐసీయూ, బెడ్లు, ఆక్సిజన్, వెంటిలేటర్ వంటి సదుపాయాలు జిల్లా వైద్యశాలలో అందుబాటులో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా నిత్యం 60-70 బెడ్లు ఖాళీగా ఉంటున్నాయి. కొవిడ్ బాధితులు, హోం ఐసొలేషన్లో చికిత్స పొందుతున్నవారు చివరి స్టేజీలోనే దవాఖానలకు పరుగులు తీస్తున్నారు. దీంతో మెరుగైన వైద్య సేవల కోసం ఇతర హాస్పిటళ్లకు రెఫర్ చేస్తున్నారు.
అందరికీ ఆదర్శం ఈ భాగీరతి..
నిర్మల్ లోని ప్రియదర్శినినగర్ కాలనీకి చెందిన 90 ఏండ్ల వృద్ధురాలు కరోనాను జయించి అందరికీ ఆదర్శంగా నిలిచింది. కొన్ని రోజుల క్రితం ఈమె కొవిడ్ బారిన పడడంతో 15 రోజుల పాటు హోం ఐసొలేషన్లో ఉంచారు. ప్రభుత్వం ఇచ్చిన మందులను వాడుతూ కోలుకున్నారు.15 రోజుల తర్వాత కుటుంబీకులు పరీక్షలు చేయిస్తే నెగెటివ్ వచ్చింది. కరోనా సోకినా భయపడకుండా దైర్యంగా ఉండడంతోనే కోలుకున్నానని భాగీరతి తెలిపింది. కొవిడ్ బారిన పడి ఆందోళన చెందుతున్న వారందరికీ ఈమె స్ఫూర్తిగా నిలుస్తున్నది.