న్యూఢిల్లీ: 5జీ టెక్నాలజీ పూర్తిగా సురక్షితం అని టెలికం ఇండస్ట్రీ బాడీ సెల్యూలార్ ఆపరేటర్స్ అసోసియేసన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) పేర్కొంది. దానివల్ల ప్రజలకు ఆరోగ్య పరంగా ముప్పు ఉందంటూ తప్పుడు ప్రచారం జరుగుతున్నదని తెలిపింది.
త్వరలో దేశంలో 5జీ టెక్నాలజీ వినియోగదారులకు అందుబాటులోకి రానున్నది. ఈ నేపథ్యంలో దాని వినియోగంతో ముప్పు ఉందని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రాణి కోటిపై 5జీ ప్రభావం తీవ్రంగా ఉంటుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
5జీ టెక్నాలజీ పూర్తిగా సురక్షితమని చెప్పడానికి అన్ని రకాల ఆధారాలు ఉన్నాయని సీవోఏఐ వెల్లడించింది. టెలికం, టెక్నాలజీ, రంగంలో భవిష్యత్లో 5జీ గేమ్ ఛేంజర్గా మారుతుందన్నది. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థకు, సమాజానికి విస్తృత ప్రయోజనాలు ఒనగూడుతాయని పేర్కొంది.
దేశంలో 5జీ సేవలను అందుబాటులోకి తేవడానికి టెలికం ప్రొవైడర్లు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సిద్ధం అవుతున్నాయి. కేంద్ర ప్రమాణాలకనుగుణంగా ఈ సేవలను తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. తక్కువ రేడియేషన్తోనే 5జీ సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.
సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచ్చర్ మాట్లాడుతూ ‘5జీ విషయంలో అంతర్జాతీయంగా ఎలక్ట్రో మ్యాగ్నటిక్ రేడియేషన్ ప్రమాణాలతో పదో వంతు మాత్రమే ఉండేలా కేంద్రం నిబంధనలు విధించింది. ప్రస్తుతం ప్రచారం తప్పుదోవ పట్టించేలా ఉంది. కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినప్పుడల్లా ఈ అసత్య ప్రచారాలు జరుగుతూనే ఉంటాయి’ అని అన్నరు.
తాజాగా 5జీ టెక్నాలజీకి వ్యతిరేకంగా బాలీవుడ్ నటి, పర్యావరణవేత్త జుహీ చావ్లా వేసిన పిటిషన్ను దిల్లీ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఇది కేవలం ప్రచారం కోసం వేసిన వ్యాజ్యమని ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. జుహీ, మరికొందరికి రూ.20లక్షల జరిమానా విధించింది.