కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 30 వరకు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అందరూ ఇంట్లో ఉండటమే శ్రేయస్కరం. ఈ సమయాన్ని తల్లిదండ్రులు కాలక్షేపానికి కాకుండా చిన్నారుల మేథస్సును పెంచేందుకు వినియోగించాలి. ‘పేరెంట్ ఈజ్ ద ఫస్ట్ టీచర్’ అన్నట్లుగా పిల్లలకు మొదటి
ఉపాధ్యాయులుగా తల్లిదండ్రులే మారాలి. ఇందుకోసం రాష్ట్ర సర్కారు ఐసీడీఎస్ అందిస్తున్న ఆన్లైన్ పాఠాలను సద్వినియోగం చేసుకుంటే సరిపోతుంది.రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ గతేడాది నుంచే 3 నుంచి 6 ఏండ్లలోపు చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తున్నది. గత సంవత్సరం ఏప్రిల్లో స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ లాంఛనంగా ప్రారంభించారు. అప్పుడే ఆన్లైన్ పాఠాలకు సంబంధించిన వెబ్సైట్ (https://icds. tgwdcw.in/preschool/) లింకును అంగన్వాడీ టీచర్లు వాట్సాప్ ద్వారా తల్లిదండ్రులకు పంపించారు. ప్రత్యేకంగా రూపొందించిన వాట్సాప్ గ్రూప్ ద్వారా ఎప్పటికప్పుడు కొత్త పాఠాల వివరాలు, వాటిని ఎలా బోధించాలో వారికి అవగాహన కల్పిస్తున్నారు.
టీ-శాట్ విద్య ద్వారా…
3 నుంచి 6 ఏండ్లలోపు పిల్లల కోసం పూర్వ ప్రాథమిక విద్యను అందించేందుకు ప్రత్యేక సిలబస్తో పాఠాలను రూపొందించారు. ఇందులో తెలుగు, ఇంగ్లిష్ అక్షరాలు, మంచి అలవాట్లు, సైన్సు పరిజ్ఞానం, కథలు, పాటలు, నేను-నా పరిసరాలు, అంకెలు, యోగా, శిశు అభివృద్ధి, సృజనాత్మక కార్యక్రమాలు, పిల్లల నైపుణ్యాలు తదితర అంశాలున్నాయి. యానిమేషన్తో రూపొందించిన ఈ పాఠాలను పిల్లలు ఆసక్తిగా వింటారు. వీటిని టీ-శాట్ విద్య చానల్ ద్వారా ఉదయం 11 నుంచి 12 గంటల వరకు ప్రసారం చేస్తున్నారు. స్మార్ట్ఫోన్ ఉన్నవారు టీ-శాట్ యాప్ను నేరుగా ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని చిన్నారులకు పాఠాలను చూపించొచ్చు. ఒకవేళ ఈ పాఠాలు ప్రసారమయ్యే సమయంలో ఫోన్ అందుబాటులో లేకున్నా చింతించాల్సిన పనిలేదు. ఇంతకు ముందు వచ్చిన పాఠాలను రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ (https:// icds. tgwdcw.in/ preschool/) వెబ్సైట్లో చూడొచ్చు.
మా పాప పాఠాలు శ్రద్ధగా వింటున్నది
చిన్నారుల కోసం ఆన్లైన్లో ఉన్న పాఠాలపై అంగన్వాడీ టీచర్ మాకు అవగాహన కల్పించింది. స్మార్ట్ఫోన్ ద్వారా రోజూ మా పాపకు పాఠాలు చూపిస్తున్నా. ఎంతో శ్రద్ధగా వింటోంది. పాపకు తెలియని అంశాలుంటే విడమర్చి చెబితే చక్కగా అర్థం చేసుకుంటున్నది. ప్రైవేటు పాఠశాలల్లో సైతం లేని విధంగా చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
– కె.స్వాతి, మునుగోడు
జిల్లాలో 2,093 కేంద్రాలు..
నల్లగొండ జిల్లాలో 1,831 అంగన్వాడీ కేంద్రాలు, 262 మినీ కేంద్రాలు కలిపి మొత్తం 2,093 ఉన్నాయి. వీటి పరిధిలో 3 ఏండ్లలోపు చిన్నారులు 48,128 మంది ఉన్నారు. పూర్వ ప్రాథమిక విద్య అవసరమైన 3 నుంచి 6 ఏండ్లలోపు చిన్నారులు 32,414 మంది ఉన్నారు.
అందుబాటులో ఈ-బుక్స్..
3 ఏండ్లు నిండిన చిన్నారులకు ‘తంగేడు పువ్వు’, 4 ఏండ్లు పైబడిన వారికి ‘పాలపిట్ట’ పేరిట రూపొందించిన ఈ-బుక్స్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. వీటిలో నేను-నా పరిసరాలు, ఇంగ్లిష్ అక్షరాలు, అంకెలు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, తెలుగు అక్షరాలు తదితర పుస్తకాలున్నాయి. పిల్లల పురోగతిని తెలుసుకునేందుకు అసెస్మెంట్ కార్డులు సైతం ఉన్నాయి. వీటిని డిపార్ట్మెంట్ పబ్లికేషన్స్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే ఇవి మనకు కనబడతాయి. పీడీఎఫ్ ఫార్మాట్లోని ఈ పుస్తకాలను డౌన్లోడ్ చేసుకొని పిల్లలకు పాఠాలు బోధించొచ్చు.