ముంబై: టీమిండియాలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీ20 వరల్డ్కప్ తర్వాత టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లి తప్పుకోనున్నట్లు సమాచారం. ప్రస్తుతం వైస్ కెప్టెన్గా ఉన్న రోహిత్ శర్మకు ప్రమోషన్ లభించనుంది. అన్ని ఫార్మాట్లకు కోహ్లి కెప్టెన్గా ఉండగా.. వరల్డ్కప్ తర్వాత కేవలం టెస్టుల్లో మాత్రమే కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించాలని కోహ్లి భావిస్తున్నాడు. దీనిపై ఇప్పటికే కోహ్లి, రోహిత్, టీమ్ మేనేజ్మెంట్ మధ్య కొన్ని నెలలుగా పలుమార్లు చర్చలు జరిగినట్లు సమాచారం.
రోహిత్ కనీసం టీ20ల్లో అయినా ఈ బాధ్యతలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్కు తిరుగులేని రికార్డు ఉన్న విషయం తెలిసిందే. తన బ్యాటింగ్పై దృష్టి సారించాలని భావిస్తున్న విరాట్ కోహ్లి.. కెప్టెన్సీ భారాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నాడు. కోహ్లియే ఈ ప్రకటన చేస్తాడు. అతడు తన బ్యాటింగ్పైనే దృష్టి సారించి.. గతంలో తాను బ్యాట్తో ఎలా రాణించాడో మళ్లీ ఆ స్థాయిని అందుకోవాలని అనుకుంటున్నాడు అని టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ వెల్లడించింది.
కోహ్లి ఇప్పటి వరకూ 95 వన్డేల్లో కెప్టెన్సీ చేపట్టగా.. అందులో 65 విజయాలు, 27 ఓటములు ఉన్నాయి. కెప్టెన్గా విజయాల శాతం 70.43 కావడం విశేషం. ఇక అతని కెప్టెన్సీలో 45 టీ20ల్లో 27 గెలిచి, 14 ఓడిపోయింది టీమిండియా. ఇక రోహిత్ శర్మ విషయానికి వస్తే 10 వన్డేల్లో కెప్టెన్గా వ్యవహరించగా.. 8 విజయాలు సాధించాడు. అటు 19 టీ20ల్లో 15 విజయాలు సాధించి పెట్టాడు.
మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ భారం తన బ్యాటింగ్పై ప్రభావం చూపుతోందని విరాట్ కోహ్లి భావిస్తున్నాడు. ఇంకా చాలా కెరీర్ మిగిలి ఉన్న నేపథ్యంలో ఇప్పుడే తన బ్యాటింగ్ను మళ్లీ గాడిలో పెట్టాలని అనుకుంటున్నాడు. కనీసం పరిమిత ఓవర్ల క్రికెట్లో అయినా ఈ భారం తగ్గితే అది తన బ్యాటింగ్కు ఉపయోగపడుతుందన్నది కోహ్లి ఆలోచనగా కనిపిస్తోంది. మూడు ఫార్మాట్లలో కెప్టెన్గా ఎంత సక్సెస్ సాధించినా.. ఇప్పటి వరకూ ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదన్న అపవాదు విరాట్పై ఉంది.