రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ఓ వైపు.. మౌన ముని కేన్ విలియమ్సన్ మరోవైపు!
బుల్లెట్ వేగంతో బంతులు విసిరే బౌల్ట్ ఓ వైపు.. యార్కర్కు కేరాఫ్ అడ్రస్ అయిన బుమ్రా మరోవైపు!
మంచినీళ్ల ప్రాయంలా సెంచరీలు కొట్టే రోహిత్ ఓ వైపు.. నిలదొక్కుకుంటే అంతుచూసే టేలర్ మరోవైపు!
సౌతాంప్టన్: ప్రపంచ అత్యుత్తమ జట్ల మధ్య సంప్రదాయ సమరానికి శుక్రవారం తెరలేవనుంది. సుదీర్ఘ ఫార్మాట్కు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రారంభించిన ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో.. బ్యాటింగే ప్రధాన బలంగా భారత్.. బౌలింగ్లో మెరుగైన అస్ర్తాలతో న్యూజిలాండ్ బరిలోకి దిగుతున్నాయి. తన సారథ్యంలో తొలి ఐసీసీ ట్రోఫీ అందుకోవాలని కోహ్లీ భావిస్తుంటే.. వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఓటమిని మరిపించాలని విలియమ్సన్ పట్టుదలగా ఉన్నాడు. చాన్నాళ్లుగా సరైన మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడం టీమ్ఇండియాకు కాస్త ప్రతికూల అంశం కాగా.. ఇంగ్లండ్పై టెస్టు సిరీస్ విజయంతో న్యూజిలాండ్ ఫుల్ జోష్లో ఉంది. మ్యాచ్కు ముందు రోజే ఫైనల్ ఎలెవన్ను ప్రకటించిన భారత్.. అనుభవానికే పెద్దపీట వేసింది. ఆసీస్ గడ్డపై అదరగొట్టిన హైదరాబాద్ ఆటగాళ్లు మహమ్మద్ సిరాజ్, హనుమ విహారికి తుది జట్టులో చోటు దక్కలేదు.
ఇలా.. అన్నీ విభాగాల్లో సమఉజ్జీలైన రెండు జట్ల మధ్య అసలు సిసలు సమరానికి సర్వం సిద్ధమైంది. ఐసీసీ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో అమీతుమీ తేల్చుకునేందుకు భారత్, న్యూజిలాండ్ రెడీ అయ్యాయి. 144 ఏండ్ల సుదీర్ఘ టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి జరుగుతున్న ఈ టోర్నీలో విజేతగా నిలువాలని కోహ్లీసేన కంకణం కట్టుకుంటే.. దేశానికి ఒక్క ఐసీసీ ట్రోఫీ అయినా అందివ్వాలని కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కృతనిశ్చయంతో ఉన్నాడు. మరింకెందుకు ఆలస్యం టెస్టు క్రికెట్లోని అసలు సిసలు మజాను ఆస్వాదించేందుకు మీరు సిద్ధమైపోండి!
గంటల్లో ఫలితం రావడానికి.. ఇది వన్డే క్రికెటో, టీ20 క్రికెటో కాదు. ఐదు రోజుల పాటు శ్రమించాల్సిందే. ఆసీస్ గడ్డపై కనబర్చిన పోరాటపటిమను కొనసాగిస్తాం. ఎంతో కష్టపడి ఇక్కడి వరకు వచ్చాం. చక్కటి ప్రదర్శనతో ఫైనల్లోనూ విజయం సాధించాలనుకుంటున్నాం. -కోహ్లీ, భారత కెప్టెన్
2 సౌతాంప్టన్ వేదికగా ఆడిన గత రెండు టెస్టుల్లోనూ భారత్ ఓటమి పాలైంది.
తుది జట్లు
భారత్: కోహ్లీ (కెప్టెన్), రోహిత్, గిల్, పుజారా, రహానే, పంత్, జడేజా, అశ్విన్, బుమ్రా, షమీ, ఇషాంత్.
న్యూజిలాండ్ (అంచనా): విలియమ్సన్ (కెప్టెన్), కాన్వే, లాథమ్, టేలర్, నికోల్స్, వాట్లింగ్, గ్రాండ్హోమ్, జెమీసన్, సౌథీ, ఎజాజ్, బౌల్ట్.
పిచ్, వాతావరణం
మ్యాచ్కు వరుణుడి ముప్పు పొంచి ఉంది. ఆకాశం మేఘావృతమై ఉంటే పిచ్ పేసర్లకు సహకరించనుంది. మ్యాచ్ సాగుతున్న కొద్దీ స్పిన్నర్లు సత్తాచాటే చాన్స్ ఉంది. ఫైనల్ పోరుకు రిజర్వ్ డే అందుబాటులో ఉంది. ఒకవేళ టెస్టు ‘డ్రా’ అయితే ఇరు జట్లను సంయుక్త విజేతగా ప్రకటించనున్నారు.
ప్రైజ్మనీ
విన్నర్
రూ.11.86 కోట్లు
రన్నరప్
రూ.5.93 కోట్లు