సౌతాంప్టన్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో పరాజయం టీమ్ఇండియాకు గట్టిదెబ్బ కొట్టేలా కనిపిస్తున్నది. కీలక పోరులో బ్యాట్స్మెన్ వైఫల్యం కారణంగానే కనీసం ‘డ్రా’ చేసుకోలేకపోయిన కోహ్లీసేన.. మార్పులపై దృష్టి పెట్టినట్లుంది. బుధవారం పరాజయం అనంతరం మాట్లాడిన విరాట్ కోహ్లీ ఆ దిశగా సంకేతాలిచ్చాడు. ‘ఈ ఓటమిని సమీక్షిస్తాం. అన్ని రకాల వాతావరణాల్లో ఆడగలిగే ఆటగాళ్లతో టీమ్ఇండియాను పటిష్ఠం చేస్తాం. ఈ ప్రణాళికలు అమలు చేసేందుకు ఎక్కువ సమయం తీసుకోం. వెంటనే చర్యలు ప్రారంభిస్తాం. మా పరిమిత ఓవర్ల జట్టు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంటుంది. టెస్టు జట్టులోనూ అలాంటి మార్పులు అవసరం. సరైన వైఖరితో ఆడగలిగే వారికి అవకాశాలిస్తాం. బౌలర్లు మనపై ఒత్తిడి పెంచుతుంటే ఎదురుదాడి చేయడమే సరైన మార్గం’ అని కోహ్లీ అన్నాడు. ఈ మాటలను బట్టి చూస్తే జట్టులో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
డబ్ల్యూటీసీ ఫైనల్ చేరే దారిలో కేవలం న్యూజిలాండ్ చేతిలో మాత్రమే సిరీస్ కోల్పోయిన భారత జట్టు.. ఫైనల్లోనూ కివీస్ చేతిలోనే భంగపడింది. సరైన సన్నద్ధత లేకుండానే కీలక పోరుకు సిద్ధం కావడం దగ్గరి నుంచి పిచ్ పేసర్లకు అనుకూలిస్తుందని క్యూరేటర్ ముందే చెపినా ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో తుది జట్టును ఎంపిక చేయడం వరకు ప్రతీ అంశంలోనూ టీమ్ఇండియాకు ఎదురుదెబ్బలే తగిలాయి. గతేడాది న్యూజిలాండ్ గడ్డపై కివీస్ పేస్ బౌలింగ్ను ఎదుర్కోలేక చతికిలపడ్డ కోహ్లీసేన.. అలాంటి వాతావరణమే ఉన్న ఇంగ్లండ్లో మరోసారి నిరాశ పరిచింది. ఫైనల్ అనంతరం కోహ్లీ మాటలను బట్టి చూస్తే జట్టులో మార్పులు తప్పేలాలేవు. అయితే అవి ఇప్పట్లో ఉంటాయనేది స్పష్టంగా చెప్పలేని పరిస్థితి.
సుదీర్ఘ ఫార్మాట్లో అత్యుత్తమ జట్టును ఎంపిక చేయాలంటే ఒకటి కాకుండా.. మూడు మ్యాచ్లు నిర్వహిస్తే మంచిదని టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సూచించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో కివీస్ చేతిలో ఓటమి తర్వాత కోహ్లీ మాట్లాడుతూ.. ‘ఒక్క మ్యాచ్తో ప్రపంచంలోని అత్యుత్తమ జట్టును ఎంపిక చేయడం అనే విధానాన్ని నేను అంగీకరించను. డబ్ల్యూటీసీ ఫైనల్ను టెస్టు సిరీస్గా నిర్వహిస్తేనే మేలు. ఒక్క మ్యాచ్లో ఓడిన జట్టు తర్వాత పుంజుకుంటుందా లేక పూర్తిగా విఫలమవుతుందా అనేది పరీక్షించాలి. భవిష్యత్తులో ఈ దిశగా ఆలోచించాలి. మూడు మ్యాచ్లు నిర్వహిస్తే.. పరిస్థితుల్లో మార్పులతో పాటు ఒకసారి ఆటలో వెనుకబడ్డా.. తిరిగి పుంజుకునే అవకాశం ఉంటుంది. ఒక మ్యాచ్లో చేసిన తప్పులు మరో రెండు మ్యాచ్ల్లో సరిదిద్దుకోవచ్చు. ఈ ఓటమితో పెద్దగా బాధపడటం లేదు’ అని అన్నాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్లో ఉత్తమ జట్టే విజేతగా నిలిచిందని భారత హెడ్కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ‘ప్రతికూల పరిస్థితుల్లో ఉత్తమ జట్టే విజేతగా నిలిచింది. ఐసీసీ ట్రోఫీ కోసం ఎంతోకాలంగా వేచిచూస్తున్న న్యూజిలాండ్ ప్లేయర్లు ఈ విజయానికి అర్హులు. గొప్ప విజయాలు అంత తేలిగ్గా రావనడానికి ఇది నిదర్శనం. విలియమ్సన్ జట్టు మెరుగైన ప్రదర్శన చేసింది’ అని రవిశాస్త్రి ట్వీట్ చేశాడు. 2000లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన న్యూజిలాండ్ ఆ తర్వాత 2015, 19 వన్డే ప్రపంచకప్ ఫైనల్స్కు చేరినా.. ఆఖరి మెట్టుపై బోల్తా కొట్టింది.