సౌథాంప్టన్: ఓ ప్లేయర్గా, కెప్టెన్గా ఎంత సక్సెస్ అయినా, ఎన్ని విజయాలు సాధించినా ఓ మెగా టోర్నీ గెలవడంలో ఉన్న కిక్కు ఉండదు. అంతటి క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్కు కూడా ఒక్క ట్రోఫీని ముద్దాడటానికి 22 ఏళ్లు పట్టింది. అప్పుడెప్పుడో 1989లో క్రికెట్లో అడుగు పెట్టిన మాస్టర్ మొత్తానికి 2011లోగానీ తన కల నెరవేర్చుకోలేకపోయాడు. ఆరు వరల్డ్కప్లు ఆడాడు. 1996, 2003ల్లో దగ్గరగా వచ్చిన చాన్స్ మిస్సయింది. మొత్తానికి తన చివరి వరల్డ్కప్లో ఆ ట్రోఫీని సగర్వంగా ముద్దాడే అవకాశం దక్కింది. ఇప్పుడు మాస్టర్ తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్లో ఆ స్థాయి బ్యాట్స్మన్గా వెలుగొందుతున్న విరాట్ కోహ్లిది అదే పరిస్థితి.
ఐసీసీ టోర్నీ.. అందని ద్రాక్షే
ఓ సాధారణ ప్లేయర్గా అదే 2011లో అందరితోపాటు వరల్డ్కప్ అందుకునే అవకాశమైతే దక్కిందిగానీ.. ఓ కెప్టెన్గా మాత్రం ఐసీసీ టోర్నీలు అతనికి చేదు అనుభవాన్నే మిగులుస్తున్నాయి. తాజాగా వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో ఫేవరెట్గా దిగినా కూడా చివరికి ఓటమి తప్పలేదు. మ్యాచ్లో రెండు రోజుల ఆట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినా.. మిగిలిన రోజుల్లోనూ ఆట సరిగా సాగకపోయినా.. చివరి రోజు డ్రానే ఖాయం అని విశ్లేషకులు అంచనా వేసినా.. దురదృష్టం మాత్రం అతన్ని వెంటాడింది. అలా అని పూర్తిగా దురదృష్టంపైనా నెట్టి వేయలేం కానీ.. ఐసీసీ నాకౌట్ మ్యాచ్లలో ఉండే ఒత్తిడిని ధోనీ లేదా రోహిత్లాగా కూల్గా అధిగమించలేకపోవడం కూడా కోహ్లిని దెబ్బ కొడుతోంది.
ఇది మూడో’సారీ’
విరాట్ కెప్టెన్సీలో టీమిండియా ఐసీసీ నాకౌట్ మ్యాచ్లలో ఓడిపోవడం ఇది మూడోసారి. గతంలో 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్థాన్ చేతిలో ఓడిపోయింది. ఇక 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఇదే న్యూజిలాండ్.. కోహ్లి సేనకు షాకిచ్చింది. తాజాగా డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ చేదు అనుభవమే ఎదురైంది. ఇక ఇప్పుడు టీమిండియా ఆడబోయే తర్వాతి ఐసీసీ టోర్నీ టీ20 వరల్డ్కప్పే. ఈ ఏడాది చివర్లో ఈ మెగా టోర్నీకి ఇండియానే ఆతిథ్యం ఇవ్వబోతోంది.