న్యూఢిల్లీ: ట్రాక్ అండ్ ఫీల్డ్లో భారత్కు తొలి స్వర్ణం అందించి చరిత్ర నెలకొల్పిన నీరజ్ చోప్రా.. టోక్యో ఒలింపిక్స్ అనంతరం సన్మాన కార్యక్రమాలతో తన శిక్షణకు బ్రేక్ పడిందని అన్నాడు. జ్వరమొచ్చినా తాను సన్మానాలకు హాజరయ్యానని, అయితే ఒక నెల తర్వాత ఈ ఆట గురించి సంబంధమే లేదన్నట్టుగా వ్యవహరించడం మంచిది కాదని చెప్పాడు. ఓ జాతీయ చానెల్కు ఇంటర్వ్యూ ఇస్తూ.. ‘టోక్యో నుంచి వచ్చాక సన్మానాలతో తీరికలేకుండా గడిపాను. ఈ క్రమంలో నాకు జ్వరం కూడా వచ్చింది. కార్యక్రమాలకు హాజరయ్యే క్రమంలో సరిగ్గా తిండి కూడా లేదు. ఇవి జరిగినన్ని రోజులు నా శిక్షణ వాయిదా పడింది. కానీ కొన్ని రోజుల తర్వాత దాని గురించి పట్టించుకోనట్టు వ్యవహరించడం మంచి పద్ధతి కాదు. క్రీడలకు ఎప్పుడూ మద్దతు ఉండాలి’ అని అన్నాడు. ఇదిలాఉండగా ఒలింపిక్స్లో జావెలిన్ త్రో ఫైనల్స్కు కొద్ది సమయం ముందు జరిగిన ఒక ఆసక్తికర విషయాన్ని కూడా నీరజ్ పంచుకున్నాడు. ‘ఫైనల్కు ముందు నా గదిలో ఉండే జావెలిన్ కనిపించలేదు. పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ దానిని పట్టుకుని అటూ ఇటూ తిరుగుతున్నాడు. దాన్ని నేను గమనించి అది నా జావెలిన్, దీనితోనే నేను విసరాలి అని అడిగాను. దాంతో అతడు జావెలిన్ను తిరిగిచ్చేసాడు. అందుకే ఫైనల్స్లో నా మొదటి త్రో కాస్త గందరగోళంగా విసిరాను’ అని నీరజ్ తెలిపాడు.