న్యూఢిల్లీ : పంజాబ్ ప్రభుత్వం అధిక ధరలకు కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులను అమ్ముకుంటోందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి శనివారం ఆరోపించారు. ప్రైవేట్ దవాఖానలకు లాభానికి పంజాబ్ ప్రభుత్వం వ్యాక్సిన్లను విక్రయిస్తోందని వచ్చిన ఆరోపణలపై కేంద్ర మంత్రి కాంగ్రెస్ సర్కార్ తీరును తప్పుపట్టారు. పంజాబ్ ప్రభుత్వం కొవిషీల్డ్ వ్యాక్సిన్ ను రూ 309కి కొనుగోలు చేసి దాన్ని ప్రైవేట్ దవాఖానలకు రూ 1560కి విక్రయిస్తోందని పూరి ఆరోపించారు.
ప్రజలకు ఉచితంగా అందించాల్సిన వ్యాక్సిన్ డోసులను పంజాబ్ సర్కార్ లాభానికి విక్రయించడం అనైతికమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం సేకరించిన వ్యాక్సిన్లలో 50 శాతం వ్యాక్సిన్లను ప్రజలకు ఉచిత వ్యాక్సినేషన్ కోసం రాష్ట్రాలకు సరఫరా చేస్తుండగా రాష్ట్రాలు తాము సమీకరించిన వ్యాక్సిన్లను లాభాలకు అమ్ముకుంటున్నాయని కేంద్ర మంత్రి ఆరోపించారు.