న్యూఢిల్లీ: స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్పై భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) సస్పెన్షన్ విధించింది. టోక్యో ఒలింపిక్స్లో నిబంధనలను అతిక్రమించిన నేపథ్యంలో డబ్ల్యూఎఫ్ఐ క్రమశిక్షణ చర్యలకు పూనుకుంది. ఈ నెల 16 లోగా వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. కాగా.. ఒలింపిక్స్లో పాల్గొనేందుకు నేరుగా హంగేరీ నుంచి టోక్యోకు వచ్చిన వినేశ్.. క్రీడా గ్రామంలో ఉండేందుకు నిరాకరించడంతో పాటు తోటి భారతీయ రెజ్లర్లతో కలిసి శిక్షణ పొందేందుకు ససేమిరా అంది. అంతేకాక.. మిగిలిన అథ్లెట్లలా భారత అధికారిక స్పాన్సర్ జెర్సీతో కాకుండా తన సొంత స్పాన్సర్ జెర్సీతో బరిలో దిగింది. ‘ఇది పూర్తి బాధ్యతా రాహిత్యం. ప్రస్తుతానికి వినేశ్ను సస్పెండ్ చేశాం. ఆమె వివరణ ఇచ్చేంత వరకు ఎలాంటి పోటీల్లో పాల్గొనడానికి వీళ్లేదు. ఆ తర్వాత డబ్ల్యూఎఫ్ఐ తుది నిర్ణయం తీసుకుంటుంది’అని ఓ అధికారి తెలిపారు.