సత్తుపల్లి, మే 22: కరోనా నుంచి కోలుకున్న ఓ వృద్ధురాలు ఐటీశాఖ మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపింది. మంత్రి చొరవతో తాను ప్రాణాలతో తిరిగొచ్చానని, సాయం చేసిన కేటీఆర్కు జీవితంతం రుణపడి ఉంటానని చెప్పింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తాళ్లమడకకు చెందిన మోరంపూడి లక్ష్మికి ఇటీవల కొవిడ్ పాజిటివ్ వచ్చింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగడంతో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సహకారంతో ఈ నెల 16న సత్తుపల్లి ప్రభుత్వ దవాఖానలో చేరింది. బాధితురాలి కుమార్తె శిరీష ఈ నెల 18న ట్విట్టర్ ద్వారా సమస్యను మంత్రి కేటీఆర్కు వివరించింది. తన తల్లి క్యాన్సర్ బాధితురాలు అని, ఆక్సిజన్ సౌకర్యం కల్పించాలని కోరింది. స్పందించిన కేటీఆర్ వెంటనే మంత్రి పువ్వాడకు ఫోన్చేసి లక్ష్మి ఆరోగ్య పరిస్థితిని వివరించారు. పువ్వాడ వెంటనే ఆక్సిజన్ బెడ్ సమకూర్చడంతో వృద్ధురాలు కోలుకొని శనివారం డిశ్చార్జి అయింది. మంత్రులు కేటీఆర్, పువ్వాడకు కృతజ్ఞతలు తెలిపింది.
కోరిన వెంటనే రెమ్డెసివిర్ ఇంజెక్షన్లను సమకూర్చి ప్రాణాలు కాపాడిన మంత్రి కేటీఆర్కు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. నల్లగొండ జిల్లా గుర్రంపోడుకు చెందిన కూన్రెడ్డి భరత్చంద్రారెడ్డి తన బాబాయి పప్పుల కొండారెడ్డికి పాజిటివ్ రావడంతో హైదరాబాద్లో ఓ దవాఖానలో చేర్పించారు. డాక్టర్లు రెండు రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు అత్యవసరమని చెప్పారు. ఎక్కడా లభించకపోవడంతో చివరకు ప్రధానిమోదీ, మంత్రి కేటీఆర్, సినీ నటుడు సోనూసూద్కు ట్విట్టర్లో విన్నవించారు. వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ రెండు ఇంజెక్షన్లను సమకూర్చారు. ఈ సందర్భంగా భరత్చంద్రారెడ్డి, అతని తల్లిదండ్రులు కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.