న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో జావెలిన్ ఈవెంట్ ఫైనల్ సమయంలో నీరజ్ చోప్రా( Neeraj Chopra ) జావెలిన్ను పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ తీసుకున్న విషయం తెలిసిందే. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. ఫైనల్ ఈవెంట్కు ముందు తన జావెలిన్ కనిపించకపోవడంతో నీరజ్ టెన్షన్ పడ్డాడు. త్రో సమయం దగ్గరపడడంతో.. కంగారులో అటూఇటూ తిరిగాడు. కానీ పాకిస్థాన్ త్రోయర్ అర్షద్ నదీమ్ వద్ద తన జావెలిన్ ఉన్నట్లు గ్రహించిన నీరజ్ దాన్ని తీసుకున్నాడు. ఇక హడావుడిగా ఆ జావెలిన్ అందుకుని.. త్రో వేసేందుకు వెళ్లాడు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. పాక్ అథ్లెట్ అర్షద్ ప్రవర్తనా తీరును కూడా సోషల్ మీడియా యూజర్స్ తప్పుపడుతున్నారు. టెన్షన్లో నీరజ్ త్రో చేసినా.. ఆ ఈవెంట్లో అతను గోల్డ్ మెడల్ గెలిచిన విషయం తెలిసిందే.
ఈ ఘటనపై నీరజ్ ఏమన్నాడంటే.. ఫైనల్ ప్రారంభమయ్యే ముందు నేను జావెలిన్ కోసం చూస్తున్నాను. కానీ అది దొరకలేదు. అయితే సడెన్గా అది అర్షద్ నదీమ్ చేతుల్లో కనిపించింది. నా జావెలిన్తో అతడు అటూఇటూ తిరుగుతున్నాడు. అది చూసి.. భాయ్ ఆ జావెలిన్ ఇవ్వు. అది నాది. నేను ఫైనల్లో దానినే విసరాలి అని అడిగాను. దీంతో అర్షద్ దానిని తిరిగి ఇచ్చేశాడు అని నీరజ్ చెప్పుకొచ్చాడు. ఈ గందరగోళం వల్లే తాను తన తొలి త్రోను హడావిడిగా విసరాల్సి వచ్చిందని నీరజ్ అన్నాడు.
ఇవాళ నీరజ్ చోప్రా ఓ వీడియో రిలీజ్ చేశాడు. పాక్ అథ్లెట్ అర్షద్ తప్పేమీ లేదని ఆ వీడియోలో నీరజ్ తెలిపారు. అన్నీ రూల్స్ ప్రకారమే జరిగినట్లు అతను వెల్లడించారు.