హైదరాబాద్ : కొనుగోలు కేంద్రాల్లో తూకం చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు వచ్చిన తర్వాత తాలు పేరుతో తరుగు తీయడం అన్యాయమని.. తేమ, తాలు, తరుగు పేరుతో రైతులను ఇబ్బందులు పెడితే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి రైస్ మిల్లర్లను హెచ్చరించారు. ఈ విషయంలో పౌరసరఫరాల ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణ జరిపి వాస్తవ పరిస్థితులను నివేదించాలని ఆదేశించారు.
ధాన్యం కొనుగోళ్లపై ప్రొక్యూర్మెంట్, మార్కెటింగ్, ఫైనాన్స్ అధికారులతో మారెడ్డి శ్రీనివాస్రెడ్డి శుక్రవారం సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రైతాంగానికి విజ్ఞప్తి చేశారు. కరోనా ప్రభావం ధాన్యం కొనుగోళ్లపై ఏమాత్రం పడకుండా చూడాలన్నారు.
క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోళ్లకు ముడిపడి ఉన్న వ్యవసాయ, మార్కెటింగ్, రవాణా, తదితర విభాగాలతో సమన్వయంతో పనిచేయాలని, కేంద్ర కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ధాన్యం లోడింగ్, అన్లోడింగ్, మిల్లింగ్పై హమాలీల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.