ముంబై: వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్లో మరో రెండు కొత్త టీమ్స్ వస్తాయని గతంలో బీసీసీఐ ప్రకటించిన విషయం తెలుసు కదా. దీనికోసం ఈ ఏడాది చివర్లో మెగా వేలం కూడా నిర్వహించాలని భావించారు. అయితే తాజాగా బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ వ్యాఖ్యలు చూస్తే మాత్రం వచ్చే ఏడాది రెండు కొత్త టీమ్స్ చేరేది అనుమానమే. ఇప్పటికే ఈ టీమ్స్ చేరికపై మార్కెట్ విశ్లేషణలు ఇంకా కొనసాగుతున్నాయి. వచ్చే ఏడాది మేము ఐపీఎల్లో మరో రెండు టీమ్స్ను చేర్చాలనుకున్నాం. కానీ మార్కెట్ను ఇంకా చూడాల్సి ఉంది. అంతేకాదు ప్రస్తుతం దేశంలోని పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. మేము పరిశీలించాల్సిన అంశాలు చాలా ఉన్న కారణంగా దీనికి ఎంత సమయంలో పడుతుందో చెప్పలేము అని అరుణ్ ధుమాల్ స్పష్టం చేశారు.
కొత్తగా వచ్చి చేరే టీమ్స్లో అహ్మదాబాద్ కూడా ఒకటని వార్తలు వచ్చాయి. అయితే అంతకంటే ముందు బిడ్డింగ్ ప్రక్రియ జరగాల్సి ఉంటుంది. పైగా వచ్చే ఏడాది ఐపీఎల్కు ముందు మెగా వేలం కూడా నిర్వహిస్తామని బోర్డు చెప్పింది. ఇందులో భాగంగా ఒక్కో ఫ్రాంచైజీ గరిష్ఠంగా ముగ్గురు ప్లేయర్స్ను మాత్రమే రిటేన్ చేసుకునే వీలుంటుంది. మరో ఇద్దరిని రైట్ టు మ్యాచ్ కింద వేలం సమయంలో తీసుకోవచ్చు. మిగతా ప్లేయర్స్ అందరినీ వదిలేయాల్సి ఉంటుంది. రెండు కొత్త ఫ్రాంచైజీలు వస్తే మెగా వేలం కచ్చితంగా నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడీ టీమ్స్ రాకపై సందేహాలు వ్యక్తమవుతుండటంతో మెగా వేలం జరుగుతుందా లేదా అన్నది కూడా చూడాలి.