గీసుగొండ, జూలై 9: పనితీరు మార్చుకోకపోతే వేటు తప్పదని కలెక్టర్ ముండ్రాతి హరిత అధికారులను హెచ్చరించారు. కోనాయిమాకుల, మనుగొండ, చంద్రయ్యపల్లిలో శుక్రవారం కలెక్టర్ ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా మెగా విలేజ్పార్కు ఏర్పాటు కోసం కోనాయిమాకుల శివారులోని ఎస్సారెస్పీకి సంబంధించిన ఐదెకరాల స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆమె మనుగొండలో పర్యటించారు. పారిశుధ్య పనులు సరిగా లేకపోవడంతో అధికారులను మందలించారు.
15 రోజుల్లో మళ్లీ వస్తా..
పదిహేను రోజుల్లో గ్రామంలో మళ్లీ పర్యటిస్తానని, ఆలోగా శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే, చంద్రయ్యపల్లి ఎస్సీకాలనీలో పర్యటించి స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వరంగల్ ఆర్డీవో మహేందర్జీ, డీఆర్డీవో సంపత్రావు, ఎంపీడీవో రమేశ్, తహసీల్దార్ సుహాసిని, ఆర్ఐ అర్జున్, ఎంపీవో మోహన్రావు, సర్పంచ్లు డోలి రాధాబాయి, నమిండ్ల రమ, ఆకుల స్రవంతి పాల్గొన్నారు.
పరిశుభ్రతే లక్ష్యంగా పని చేయాలి
ఆత్మకూరు: గ్రామాల్లో పరిశుభ్రతే లక్ష్యంగా సర్పంచ్లు, అధికారులు పని చేయాలని కలెక్టర్ హరిత అన్నారు. గీసుగొండ మండలంలోని పలు గ్రామాలను పరిశీలించిన ఆమె అక్కంపేట మీదుగా వరంగల్కు వెళ్తూ గ్రామ శివారులో కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా సర్పంచ్ విజయ హంసాల్రెడ్డితో మాట్లాడారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. సర్పంచ్ వెంట కార్యదర్శి సంపూర్ణ ఉన్నారు.