జపాన్ : టోక్యో ఒలింపిక్స్ క్రీడా గ్రామంలో కరోనా వైరస్ కలకలం. శనివారం తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదవగా ఆదివారం మరో ఇద్దరికి కరోనా నిర్ధారణ అయింది. స్ర్కీనింగ్ పరీక్షల్లో ఇద్దరు అథ్లెట్లకు కొవిడ్-19 పాజిటివ్గా తేలింది. ఈ నెల 23 నుంచి ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్ క్రీడా గ్రామంలో క్రీడాకారులకు ప్రతిరోజూ కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
కరోనా భారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో వేలాది మంది అథ్లెట్లు పాల్గొంటున్న మహాక్రీడల్లో మహమ్మారి ఎలా విజృంభిస్తుందో అన్న భయం నెలకొంటుంది. విలేజ్లో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తున్న సమయంలో.. తొలి కేసు బయటపడినట్లు టోక్యో నిర్వాహక కమిటీ ప్రతినిధి మాసా టకాయా తెలిపారు. గేమ్స్ నిర్వహణ కోసం విదేశాల నుంచి వచ్చిన ఓ విజిటర్కు వైరస్ సంక్రమించినట్లు టోక్యో 2020 సీఈవో తోషిరో ముటో తెలిపారు.