టోక్యో: ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ గెలవాలన్నది ప్రతి అథ్లెట్ కల. అలాంటి గోల్డ్ మెడల్(Gold Medal)ను మరొకరితో పంచుకోవడానికి ఎవరూ ఇష్టపడరు. కానీ టోక్యో ఒలింపిక్స్లో ఆదివారం ఆ అనుకోనిదే జరిగింది. రెండు దేశాలకు చెందిన ఇద్దరు అథ్లెట్లు గోల్డ్ మెడల్ను పంచుకోవడానికి అంగీకరించడం విశేషం. హైజంప్ ఈవెంట్లో ఖతార్కు చెందిన ముతాజ్ బర్షిమ్, ఇటలీకి చెందిన గియాన్మార్కో తంబేరీ గోల్డ్ను షేర్ చేసుకున్నారు. ఈ ఇద్దరూ 2.37 మీటర్ల ఎత్తుపై నుంచి దూకారు. దీంతో అధికారులు 2.39 మీటర్ల ఎత్తు సెట్ చేశారు. అయితే ఈ ఇద్దరూ అంత ఎత్తు జంప్ చేయలేకపోయారు.
ఇలాంటి సమయంలో మీ ఇద్దరూ అంగీకరిస్తే గోల్డ్ మెడల్ను పంచుకునే అవకాశం ఉంటుందని అధికారులు వారికి చెప్పారు. అఫీషియల్ ఆ మాట అనడం పూర్తి కాకముందే ఖతార్ అథ్లెట్ బర్షిమ్ తాను రెడీ అని, నీకు ఓకేనా అంటూ తంబేరీని అడిగాడు. దానికి అతడు కూడా అంగీకరించడంతో ఇద్దరూ ఆనందంతో ఒకరినొకరు హగ్ చేసుకున్నారు. పోడియంపై కూడా ఇద్దరూ గోల్డ్ మెడల్ను వేసుకున్నారు.