హయత్నగర్, ఏప్రిల్ 1: నష్టాల బారిన పడిన ఆర్టీసీ సంస్థను గట్టేక్కించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా కరోనా కాలంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్న ఆర్టీసీకి ఆదాయాన్ని సమకూర్చేందుకు కార్గో సేవలను ప్రారంభించింది. ఇటీవల ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటుకు కూడా గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. హయత్నగర్ డిపో పరిధిలో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ట్రాక్ ఏర్పాటు సిద్ధమవుతుండటంతో త్వరలోనే శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ శిక్షణ నిరుద్యోగులకు ఎంతో ఉపయోగపడనున్నదని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
హయత్నగర్ ఆర్టీసీ డిపో-1 ఆధ్వర్యంలో అర్హులైన నిరుద్యోగులకు డ్రైవింగ్ శిక్షణ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, అందుకు తగిన ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు డిపో మేనేజర్ ఆధ్వర్యంలో శిక్షణకు తరగతి గది, ప్రత్యేక బస్సు, ట్రాక్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. డిపోలో తరగతులు పూర్తి అయిన వెంటనే ట్రాక్పై శిక్షణ ఇవ్వనున్నారు.
శిక్షణ పొందేవారు డ్రైవింగ్తో పాటు అన్ని విభాగాల్లో పరిణతి సాధించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. బస్సు కండీషన్, ఇంజిన్ విభాగాలు, పనితీరుపై థియరీతో పాటు ప్రత్యేక అవగాహన కల్పించనున్నారు. వివిధ విడిభాగాల్లో తలెత్తే లోపాలు, ఫలితంగా ఏర్పడే సమస్యలు, వాటి పరిష్కారాలు, బ్రేక్ ఫెయిలైన సందర్భాల్లో అనుసరించాల్సిన విధానాలపై నిష్ణాతులైన వారితో అవగాహన కల్పించనున్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత ధ్రువీకరణ పత్రాన్ని అందజేయనున్నారు. దీని ఆధారంగానే రవాణా శాఖ ఏవీ డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు.
డ్రైవింగ్ శిక్షణ కోసం ప్రత్యేక బస్సును ఏర్పాటు చేశారు. ఈ బస్సులో రెండు స్టీరింగ్లు ఏర్పాటు చేశారు. శిక్షణ సమయంలో ఎలాంటి ప్రమాదాలు తలెత్తకుండా స్టీరింగ్ వద్ద క్లచ్, బ్రేక్, ఎక్స్లేటర్ ద్వారా శిక్షకుడు బస్సు గమనాన్ని నియంత్రించనున్నాడు. ఒక స్టీరింగ్ వద్ద శిక్షకుడు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం శిక్షణ పొందేవారు డ్రైవింగ్ చేస్తారు. కాగా అర్హులైన వారిని ఎంపిక చేసి డ్రైవింగ్లో శిక్షణ అందించనున్నారు. ఇందుకోసం సంస్థకు కొంతమేర ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. 18 ఏండ్లు నిండి, డ్రైవింగ్పై ఆసక్తి ఉన్న యువతీయువకులకు శిక్షణ అందించనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.