న్యూఢిల్లీ: గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లాతో తామెటువంటి చర్చలు జరుపలేదని టాటా పవర్ కొట్టి పారేసింది. దేశంలో విద్యుత్ వాహనాలకు అవసరమైన వెహికల్ చార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పనపై టెస్లా మోటార్స్తో చర్చలు జరిపినట్లు వచ్చిన వార్తలను తోసిపుచ్చింది. ఈ మేరకు ఈ నెల 12వ తేదీన సీఎన్బీసీ టీవీ-18 చానెల్లో వచ్చిన వార్తాకథనం పూర్తిగా తప్పని ఆదివారం స్పష్టం చేసింది.
తాము సొంతంగా దేశంలో విద్యుత్ వాహనాల మౌలిక వసతుల కల్పనపై కేంద్రీకరిస్తామని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. టెస్లాతో టాటా సన్స్ అనుబంధ టాటా పవర్ చర్చలు జరుపుతున్నట్లు వార్తలొచ్చిన నేపథ్యంలో చంద్రశేఖరన్ వ్యాఖ్యకు ప్రాధాన్యం సంతతరించుకున్నది. తమ టాటా మోటార్స్, జాగ్వార్ లాండ్ రోవర్ కార్ల తయారీ సంస్థలు భవిష్యత్లో ఎలక్ట్రిక్ మొబిలిటీలోకి ఎలా దూసుకెళ్లాలన్న అంశంపై కేంద్రీకరించామని టాటా సన్స్ స్పష్టం చేసింది.
‘దేశవ్యాప్తంగా బిజినెస్ అభివృద్ధి చేయడానికి గల అవకాశాలను మా ఈవీ చార్జింగ్ బిజినెస్ విభాగం నిరంతరం పరిశీలిస్తున్నది. మీడియాలో వార్తలొచ్చినట్లు ఏ సంస్థతోనూ ఎటువంటి అరేంజ్మెంట్ గానీ, అగ్రిమెంట్ గానీ జరుగలేదు’ అని టాటా పవర్ తెలిపింది. టాటా పవర్, టెస్లా మోటార్స్ వర్గాలను ఉటంకిస్తూ సీఎన్బీసీ-18 శుక్రవారం దేశవ్యాప్తంగా విద్యుత్ వాహనాలకు చార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వసతి కల్పనకు చర్చలు జరుగుతున్నాయని వార్త ప్రసారం చేసింది. ఈ నివేదిక రాగానే 2014 జూన్ 9 తర్వాత టాటా పవర్ షేర్ 5.5 శాతం పెరిగింది.
అయితే, ఇంతకుముందే దేశంలోని ప్రధాన నగరాల పరిధిలో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ మౌలిక వసతుల కల్పనకు ఎంజీ మోటార్స్తో కలిసి టాటా పవర్ పని చేస్తున్నది. పలు నగరాల్లో ఇప్పటికే 50కిలోవాట్ల సామర్థ్యం గల ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఇప్పటికే ఏర్పాటు చేసింది.
అమెరికా కేంద్రంగా ఎలక్ట్రిక్ కార్లు తయారుచేస్తున్న టెస్లా మోటార్స్.. భారతదేశంలో తన మోడల్ త్రీ ఎలక్ట్రిక్ సెడాన్ కారుతో ఎంట్రీ ఇవ్వాలని తలపెట్టిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కర్ణాటకలో టెస్లా మోటార్స్ ఇండియా అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట జనవరిలో టెస్లా కంపెనీని రిజిస్టర్ చేసింది.