ఎల్లారెడ్డిపేట, జూలై 29: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామానికి చెందిన గిరిజన ఖోఖో క్రీడాకారుడు ముదావత్ వెంకటేశ్కు చేయూత లభించింది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రోద్బలంతో ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కింద టీఆర్ఎస్ యువజన నాయకుడు రాకేశ్ యాదవ్ ఆర్థిక సాయం అందజేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జాతీయ క్రీడాసంస్థ (ఎన్ఎస్ఎన్ఐఎస్) లో సీటు దక్కించుకున్న వెంకటేశ్ ఆర్థిక పరిస్థితి గమనించి హైదరాబాద్కు ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాకేశ్ సమకూర్చిన రూ.1.80 లక్షల చెక్కును గురువారం మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా వెంకటేశ్కు అందించారు. ఈ కార్యక్రమంలో పోత్గల్ పీఏసీఎస్ చైర్మన్ తన్నీరు బాపురావు పాల్గొన్నారు.