కొత్తపల్లి/ సుల్తానాబాద్, మార్చి 18: క్రీడా శిఖరం నేలకొరిగింది. అంతర్జాతీయ పారా ఒలింపిక్ కెరటం తిరిగి రాని లోకాలకు తరలిపోయింది. జిల్లా క్రీడాలోకం శోక సంద్రంలో మునిగిపోయింది. జన్మత: దివ్యాంగుడైనా సడలని ఆత్మ విశ్వాసం, పట్టుదలతో జగజ్జేతగా నిలిచి విశ్వక్రీడా యవనికపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన అంతర్జాతీయ పారా ఒలింపిక్ క్రీడాకారుడు, అర్జున అవార్డు గ్రహీత శ్రీనివాసరావు అస్తమించారు. ఆటే శ్వాసగా ఆడిన ప్రతి పోటీలో విజేతగా నిలిచి తుదకు క్యాన్సర్ మహమ్మారి చేతిలో పరాజితుడై తుది శ్వాస విడిచారు. గురువారం ఉదయం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు దవాఖానలో కన్నుమూయగా ఆయన మృతికి మంత్రి గంగులతోపాటు కలెక్టర్ పలువురు క్రీడాకారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు సంతాపం తెలిపారు.
అంతర్జాతీయ పారా ఒలింపిక్ క్రీడాకారుడు మాదాసు శ్రీనివాసరావు (68) కొంతకాలంగా కార్సినోమా (ఊపిరితిత్తుల క్యాన్సర్)తో బాధపడుతూ పరిస్థితి విషమించి చనిపోయారు. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలో మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించిన శ్రీనివాసరావు వృత్తిరీత్యా ఆర్టీసీలో మెకానిక్గా చేరారు. ఆయనకు భార్య రమాదేవి, ఇద్దరు కొడుకులు రోహిత్, రోహన్, కూతురు రుత్వి ఉన్నారు. ప్రస్తుతం కరీంనగర్లో నివాసం ఉంటున్నారు. ఆయనకు క్రీడలపై అమితాభిమానం. ఆయన ఆసక్తికి వైకల్యం అడ్డుకాలేదు. జిల్లా క్రీడాశాఖ ఉద్యోగి సిద్ధారెడ్డి సూచనలతో దివ్యాంగుల క్రీడలో శిక్షణ పొందారు. ఈ క్రమంలో ఉత్తమ దివ్యాంగ ఉద్యోగిగా 1994లో జాతీయ స్థాయి అవార్డును అప్పటి రాష్ట్రపతి శంకర్దయాళ్ శర్మ చేతుల మీదుగా అందుకున్నారు. దివ్యాంగుల జాతీయ క్రీడా సంఘానికి అనుబంధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ను ఏర్పాటు చేసి వ్యవస్థాపక అధ్యక్షుడిగా కొనసాగారు. 1989లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కుముద్బెన్జోషి చేతుల మీదుగా ఉత్తమ దివ్యాంగ ఉద్యోగిగా రాష్ట్రస్థాయి పురస్కారం అందుకున్నారు. 1996లో లండన్లో జరిగిన దివ్యాంగుల ప్రపంచ షూటింగ్ చాంపియన్షిప్లో స్వర్ణపతకాన్ని సాధించారు. పలు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని పతకాలు కైవసం చేసుకున్నారు. 2002లో బెంగళూర్లో జరిగిన వరల్డ్ పారా బ్యాడ్మింటన్లో స్వర్ణం సాధించారు.
ఆయన ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం 2003లో అర్డున అవార్డును ప్రకటించింది. అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి పారా అథ్లెటిక్ విభాగంలో అర్జున పురస్కారాన్ని పొందిన తొలి క్రీడాకారుడిగా శ్రీనివాసరావు రికార్డు సాధించారు. కేవలం షూటింగ్, బ్యాడ్మింటన్ మాత్రమే కాకుండా పలు క్రీడల్లో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నారు. 2010లో చైనాలోని గ్వాంగ్ జూలో జరిగిన ఏషియన్ పారా ఫెన్సింగ్లో భారత్కు ప్రాతినిథ్యం వహించారు. 2004లో మలేషియాలో జరిగిన మెన్స్ డబుల్స్ ఏషియన్ పారా బ్యాడ్మింటిన్లో కాంస్య పతకం, 2006లో ఇజ్రాయిల్లో సింగిల్స్ ఓపెన్ బ్యాడ్మింటన్లో కాంస్యం గెలుచుకున్నారు. 2010లో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ క్వీన్స్ బ్యాటన్ రిలేలో పాల్గొని నాటి ఏపీ ముఖ్యమంత్రి రోశయ్య చేతుల మీదుగా జ్ఞాపిక అందుకున్నారు. 2006 నుంచి ముంబై మారథాన్ రన్లో వరుసగా పాల్గొన్నారు. చివరగా 2018లో బెంగళూర్లో జరిగిన 10కే మారథాన్లో కాంస్య పతకం సాధించడం విశేషం. తన అసమాన క్రీడా ప్రతిభతో పలు క్రీడల్లో పారా ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్షిప్, ఏషియన్ మీట్, కామన్వెల్త్ గేమ్స్, దివ్యాంగుల విభాగంలో బ్యాడ్మింటన్, షూటింగ్, టేబుల్ టెన్నిస్, ఫెన్సింగ్, వెయిట్ లిఫ్టింగ్ క్రీడల్లో పలు పతకాలు కైవసం చేసుకోవడం ఆయన అసమాన ప్రతిభకు నిదర్శనం. ఎంతోమంది దివ్యాంగులు క్రీడల్లో భాగస్వామ్యమయ్యేలా స్ఫూర్తినిచ్చారు. ఆయన స్ఫూర్తితో అంజనారెడ్డి, రఘురాంలాంటి వారు దివ్యాంగ క్రీడాకారులుగా ఎదిగి అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించారు.
ఇంటిపేరుగా అర్జున
2003లో అందుకున్న అర్జున పురస్కారంతో అప్పటి నుంచి ఆయనను అర్జున శ్రీనివాస్గా పిలుస్తున్నారు. ఈ అవార్డు రావడంపై ఏపీ సీఎం వైఎస్ఆర్ రూ. లక్ష నజరానాను అందించి అభినందించారు. 2017లో తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగ స్ఫూర్తి అవార్డును అందించింది. పద్మ శ్రీ పురస్కారానికి ప్రభుత్వం ఆయన పేరును సిఫారసు చేసింది. అంతర్జాతీయ క్రీడాకారులకు ఇల్లు రిజిస్ట్రేషన్కు అయ్యే చార్జీలను ఉచితంగా ఇవ్వాలనే జీవోను తీసుకురావడంలో శ్రీనివాసరావు కృషి ఎంతో ఉంది. కరీంనగర్లో ఆయన పేరుమీద 2004లో కాలనీని ఏర్పాటు చేశారు. దేశ ఖ్యాతిని ప్రపంచ యవనికపై చాటిచెప్పిన ఆయనకు నాటి ప్రభుత్వాలు కనీసం ఇంటి స్థలం కూడా ఇవ్వలేదు.
స్వగ్రామంలో అంత్యక్రియలు
శ్రీనివాసరావు అంత్యక్రియలు స్వగ్రామమైన గర్రెపల్లిలో క్రీడాభిమానులు, బంధువులు, మిత్రులు, గ్రామస్తుల అశ్రునయనాల మధ్య జరిగాయి. కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశాల మేరకు జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి కే రాజవీర్ ప్రభుత్వ ప్రతినిధిగా వెళ్లి అంత్యక్రియల ఏర్పాట్లను దగ్గరుండి చూసుకున్నారు. సర్పంచుల ఫోరం మండలాధ్యక్షురాలు, గర్రెపల్లి సర్పంచ్ వీరగోని సుజాత, ఎంపీటీసీ పులి అనూష, మాజీ సింగిల్ విండో చైర్మన్ వీరగోని రమేశ్గౌడ్, గ్రామపంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, ఉప సర్పంచ్ ఎల్లవేణి మధూకర్, వార్డు, కో-ఆప్షన్ సభ్యులు హన్మంత రావు, నందకిశోర్, గ్రామంలోని క్రీడాకారులు మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
మంత్రి, కలెక్టర్, ప్రముఖుల సంతాపం
శ్రీనివాసరావు మృతికి రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, కరీంనగర్ కలెక్టర్ సంతాపం వ్యక్తం చేశారు. శ్రీనివాసరావు మరణం జిల్లా క్రీడారంగానికి తీరని లోటని, తన క్రీడా ప్రతిభతో కరీంనగర్కు గొప్ప పేరును తీసుకువచ్చారని జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు నందెల్లి మహిపాల్, గసిరెడ్డి జనార్దన్రెడ్డి, ఉపాధ్యక్షుడు తుమ్మల రమేశ్రెడ్డి, మహ్మద్ కరీం, కోశాధికారి నాగిరెడ్డి సిద్ధారెడ్డి, పలు క్రీడా సంఘాల బాధ్యులు కడారి రవి, మిల్కూరి సమ్మిరెడ్డి, జీ విజయ, భాస్కర్రెడ్డి, సీ మహేందర్, కే సంతోష్ తదితరులు విచారం వ్యక్తం చేశారు.