టోక్యో: ప్రతిష్ఠాత్మక టోక్యో పారాలింపిక్స్లో భారత్కు పతకం ఖరారైంది. టేబుల్ టెన్నిస్ (టీటీ)లో భవీనాబెన్ పటేల్ కొత్త చరిత్ర లిఖించింది. విశ్వక్రీడల టీటీలో ఫైనల్ చేరిన తొలి భారత ప్లేయర్గా పటేల్ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. శనివారం జరిగిన మహిళల టీటీ సింగిల్స్ క్లాస్-4 సెమీఫైనల్లో భవీన 3-2(7-11, 11-7, 11-4, 9-11, 11-8) తేడాతో చైనాకు చెందిన మియా జాంగ్పై అద్భుత విజయం సాధించింది. 34 నిమిషాల పాటు జరిగిన సెమీస్లో పోరులో ఆది నుంచి దూకుడు కనబరిచిన పటేల్ పోరాటపటిమతో ఆకట్టుకుంది. అసలు ఎలాంటి అంచనాలు లేకుండానే బరిలోకి దిగిన ఈ 34 ఏండ్ల టీటీ ప్లేయర్..ప్రపంచ మూడో ర్యాంకర్ జాంగ్ను మట్టికరిపించింది. 7-11తో తొలి గేమ్ను చేజార్చుకున్న భవీన వరుసగా రెండు గేమ్లు పోటీలోకి వచ్చింది. అయితే నాలుగో గేమ్లో ఈ సీనియర్ ప్యాడ్లర్కు ప్రత్యర్థి ప్రతిఘటన ఎదురైంది. పుంజుకుని పోటీలోకి వచ్చిన జాంగ్..పటేల్కు జోరుకు బ్రేక్ వేసింది. నిర్ణయాత్మక ఐదో గేమ్లో ఇరువురి మధ్య పోరు హోరాహోరీగా సాగింది. 5-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన భవీనకు దీటుగా చైనా ప్యాడ్లర్ పోటీలోకి వచ్చినా..అప్పటికే సమయం మించిపోయింది. వరుస పాయింట్లతో గేమ్తో పాటు మ్యాచ్ను కైవసం చేసుకుని సంబురాల్లో మునిగిపోయింది. ఆదివారం జరిగే స్వర్ణ పతక పోరులో ప్రపంచ నంబర్వన్ చైనాకు చెందిన యింగ్ జౌతో భవీన తలపడనుంది. గుజరాత్లోని మెహసానా జిల్లా సుంధియా గ్రామానికి చెందిన భవీనా..12 ఏండ్ల ప్రాయంలోనే పోలియో బారిన పడినా.. మొక్కవోని ఆత్మవిశ్వాసంతో టేబుల్ టెన్నిస్లో అద్భుత విజయాలతో దూసుకెళుతున్నది. సరిగ్గా 13 ఏండ్ల క్రితం టీటీని కెరీర్గా ఎంచుకున్న పటేల్..థాయ్లాండ్ టీటీ చాంపియన్షిప్లో రజత పతకం ద్వారా ప్రపంచంలో రెండో ర్యాంక్ను దక్కించుకుంది. అదే జోరులో 2013లో ఆసియా పారా టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో పటేల్ వెండి పతకంతో మెరిసింది.