జాతీయ క్రీడాదినోత్సవం రోజు భారత పారా అథ్లెట్లు అద్వితీయ ప్రదర్శన కనబర్చారు. టోక్యో పారాలింపిక్స్లో ఒక్క రోజే మూడు పతకాలు సాధించి అంతర్జాతీయ యవనికపై మువ్వ న్నెలజెండానురెపరెపలాడించారు. టేబుల్ టెన్నిస్లో భవీనాబెన్ పటేల్ రజత పతకం చేజిక్కించుకుంటే.. హై జంప్లో నిషాద్ కుమార్ మ్ సీన్ రిపీట్ చేశాడు. డిస్కస్ త్రోలో వినోద్ కుమార్ కాంస్య కాంతులు విరజిమ్మాడు. టోక్యో ఒలింపిక్స్లో భారత అథ్లెట్లు విశ్వక్రీడల్లోనే అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేయగా.. పారాఅథ్లెట్లూ అదే బాటలో నడుస్తూ యావత్ భారతాన్ని ఆనంద డోలికల్లో ముంచెత్తారు!
టోక్యో: పారాలింపిక్స్లో భారత అథెట్లు అదరగొట్టారు. జాతీయ క్రీడా దినోత్సవం (హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్చంద్ జయంతి, ఆగస్టు 29) నాడు మనవాళ్లు విశ్వ వేదికపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. టేబుల్ టెన్నిస్ (టీటీ)లో భవానీబెన్ పటేల్ కొత్త చరిత్ర లిఖిస్తూ రజత పతకం గెలుచుకుంటే.. హైజంప్లో నిషాద్ కుమార్ ఆసియా రికార్డును సమంచేస్తూ సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్నాడు. డిస్కస్ త్రోలో వినోద్ కుమార్ కాంస్యం నెగ్గడంతో ఒకే రోజు భారత్ ఖాతాలో మూడు పతకాలు చేరాయి. నిలకడైన ప్రదర్శనతో ఫైనల్ చేరిన భవీన ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ క్లాస్-4 స్వర్ణ పతక పోరులో 0-3 (7-11, 5-11, 6-11)తో ప్రపంచ నంబర్వన్ యింగ్ జో (చైనా) చేతిలో ఓటమి పాలై రజతం చేజిక్కించుకుంది. పారాలింపిక్స్ టేబుల్ టెన్నిస్లో భారత్కు ఇదే తొలి పతకం కాగా.. ప్రస్తుత భారత పారాలింపిక్ కమిటీ అధ్యక్షురాలు దీపా మాలిక్ తర్వాత ఈ వేదికపై భారత్ తరఫున పతకం నెగ్గిన రెండో మహిళా అథ్లెట్గా భవానీ రికార్డుల్లోకెక్కింది. పురుషుల హైజంప్ (టీ47)లో నిషాద్ కుమార్ 2.06 మీటర్ల ఎత్తు దూకి సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్నాడు. పురుషుల డిస్కస్ త్రో (ఎఫ్52)లో వినోద్ కుమార్ డిస్క్ను 19.91 మీటర్ల దూరం విసిరి కాంస్యం గెలచుకున్నాడు. పారాలింపిక్స్లో దేశం గర్వించే ప్రదర్శన చేసిన అథ్లెట్లను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.
రైతు బిడ్డ
ఎనిమిదేండ్ల ప్రాయంలో ప్రమాదవశాత్తు గడ్డి కత్తిరించే యంత్రంలో పడి కుడిచేతిని కోల్పోయిన నిషాద్ కుమార్.. తాజా క్రీడల్లో భారత్కు రెండో పతకాన్ని అందించాడు. పురుషుల హైజంప్లో 2.06 మీటర్ల ఎద్దు దూకి రెండో స్థానంలో నిలిచిన నిషాద్.. రజతం ఖాతాలో వేసుకోవడంతో పాటు తన పేరిటే ఉన్న ఆసియా రికార్డును సమం చేశాడు. ఈ పోటీల్లో అమెరికాకు చెందిన టౌన్ సెండ్ రోడ్రిక్ టౌన్సెండ్ 2.15 మీటర్లతో స్వర్ణం చేజిక్కించుకోగా.. నిషాద్తో సమానంగా 2.06 మీటర్ల దూరాన్ని నమోదు చేసిన అమెరికా అథ్లెట్ డల్లాస్ వైస్ కాంస్యం గెలుచుకున్నాడు. హిమాచల్ ప్రదేశ్కు చెందిన 21 ఏండ్ల నిషాద్ ఈ ఏడాది ఆరంభంలో బెంగళూరులోని సాయ్ సెంటర్లో కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్న తర్వాత చక్కటి ప్రదర్శనతో దేశాన్ని గర్వపడేలా చేశాడు. ఇదే విభాగంలో పోటీ పడిన మరో భారత అథ్లెట్ రామ్పాల్ 1.94 మీటర్ల ఎత్తు దూకి ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. మరోవైపు ఆర్చరీలో భారత్కు నిరాశ ఎదురైంది. కాంపౌండ్ మిక్స్డ్ ఈవెంట్లో రాకేశ్ కుమార్, జ్యోతి బలియాన్ జోడీ ఆదివారం క్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలైంది.
భవీనాకు నజరానాల వెల్లువ
పారాలింపిక్స్లో రజతంతో మెరిసిన భవీనాబెన్ పటేల్కు నజరానాల వెల్లువ మొదలైంది. రజతం గెలిచిన వెంటనే భవీనాకు గుజరాత్ ప్రభుత్వం రూ. 3 కోట్ల నగదు బహుమతి ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.మరోవైపు భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య (టీటీఎఫ్ఐ) భవీనాకు రూ. 31 లక్షల రివార్డును ప్రకటించింది.
ఆఖరి మెట్టుపై..
టోక్యోలో అడుగు పెట్టినప్పటి నుంచి చక్కటి ప్రదర్శనతో దూసుకెళ్తున్న భవీనాబెన్ పటేల్.. తుదిపోరులో అదే జోరు కొనసాగించలేకపోయింది. క్వార్టర్స్, సెమీస్లో ప్రత్యర్థులను చిత్తు చేసిన భవీన.. ప్రపంచ నంబర్వన్ యింగ్ జోపై ఆధిపత్యం కనబర్చలేకపోయింది. 19 నిమిషాల్లో ముగిసిన పోరులో 34 ఏండ్ల భవీన కాస్త ఒత్తిడికి లోనైనట్లు కనిపించింది. 2016 రియో ఒలింపిక్స్కు ఎంపికైనా.. సాంకేతిక కారణాల వల్ల పోటీల్లో పాల్గొనలేకపోయిన భవీన.. తన పోరాటాన్ని కొనసాగిస్తూ టోక్యోకు అర్హత సాధించింది. పోలియో కారణంగా ఏడాది వయసు నుంచే చక్రాల కుర్చీకి పరిమితమైన భవీన.. అచెంచల ఆత్మవిశ్వాసంతో ఈ స్థాయికి చేరింది. పతకం నెగ్గిన అనంతరం భవీన మాట్లాడుతూ.. ‘నేను పతకం నెగ్గాలని ప్రార్థించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు. మీ ప్రోత్సాహం వల్లే ఈ విజయం సాధ్యమైంది. రజతం గెలిచినందుకు సంతోషంగా ఉన్నా. అయితే తుదిపోరులో కాస్త ఒత్తిడికి లోనయ్యా. ప్రత్యర్థి చక్కటి ఆటతో నాపై ఆధిపత్యం ప్రదర్శించింది. ఈసారి ఆమెతో తలపడ్డప్పుడు కొత్త భవీనను పరిచయం చేస్తా. కష్టపడితే సాధించలేనిదంటూ ఏది లేదు’అని చెప్పుకొచ్చింది. భవీనపై నెగ్గిన యింగ్ జోకు పారాలింపిక్స్లో ఇది ఐదో పతకం కావడం విశేషం.
సచిన్ను కలుస్తా..
పారాలింపిక్స్లో రజతం నెగ్గి నయా చరిత్ర సృష్టించిన భవీనాబెన్ పటేల్.. ఇప్పుడు తన మరో లక్ష్యాన్ని పూర్తి చేసుకోవాలనుకుంటున్నది. చిన్నప్పటి నుంచి ఎంతగానో అభిమానిస్తున్న క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ను కలువాలనుకుంటున్నది. భవీన భర్త నికుల్ పటేల్ మాట్లాడుతూ.. ‘సచిన్ టెండూల్కర్ అంటే భవీనకు వల్లమాలిన అభిమానం. ఆమె మాస్టర్నే రోల్మోడల్గా భావిస్తూ పెరిగింది. టోక్యో నుంచి తిరిగి వచ్చాక సచిన్ను కలిసే ప్రయత్నం చేస్తాం’అని అన్నాడు.
జీవితమే పోరాటం..
టోక్యో పారాలింపిక్స్ పోటీల ఐదో రోజు దేశానికి ముచ్చటగా మూడో పతకాన్ని అందించిన వినోద్ కుమార్ జీవితమే ఓ పోరాటం. వినోద్ తండ్రి 1971 భారత్-పాక్ యుద్ధంలో సైన్యానికి సేవలందిస్తూ గాయపడగా.. ఆయన బాటలోనే నడిచిన అతడు యుక్త వయసులోనే బీఎస్ఎఫ్లో చేరాడు. జమ్ముకశ్మీర్లోని లేహ్లో విధులు నిర్వర్తిస్తుండగా.. కొండ చరియలు విరిగిపడి తీవ్రంగా గాయపడిన వినోద్ దాదాపు పదేండ్లు మంచానికే పరిమితమయ్యాడు. తాజా పోటీల్లో 41 ఏండ్ల వినోద్ డిస్క్ను 19.91 మీటర్ల దూరంతో కాంస్యం చేజిక్కించుకోగా.. కోసెవిక్ (20.02 మీటర్లు, పోలాండ్), వెలిమిర్ సాండోర్ (19,98 మీటర్లు, క్రొయేషియా) వరుసగా స్వర్ణ, రజతాలు గెలుచుకున్నారు. అయితే ఎఫ్52 క్లాసిఫికేషన్ విషయంలో కొందరు అథ్లెట్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో విజేతలకు బహుమతులనిచ్చే కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.
పారాలింపిక్స్ టేబుల్ టెన్నిస్లో భారత్కు ఇదే తొలి పతకం.
పారాలింపిక్స్లో పతకం సాధించిన రెండో మహిళా అథ్లెట్గా భవీన రికార్డుల్లోకెక్కింది. 2016 ఒలింపిక్స్ షాట్పుట్లో రజతం నెగ్గిన దీపా మాలిక్ తొలి మహిళగా చరిత్రకెక్కింది.
పారాలింపిక్స్లో రజతం సాధించిన భవీనా భారత బృందానికి, క్రీడాప్రేమికులకు స్ఫూర్తినిస్తున్నది. నీ అసాధారణమైన సం కల్పం, నైపుణ్యాలు దేశానికి కీర్తిని తెచ్చాయి. ఈ అద్భుత విజయాన్ని సాధించిన భవీనాకు అభినందనలు.
భవీనా పటేల్ చరిత్ర సృష్టించింది. ఆమె దేశానికి రజత పతకాన్ని తీసుకువస్తున్నది. అం దుకు ఆమెకు అభినందనలు. భవీనా జీవిత చరిత్ర ఎంతోమందికి ప్రేరణగా నిలవడమే గాక యువతను క్రీడలవైపు ఆకర్షితులను చేస్తుంది.