Munich massacre | టోక్యోలో ఒలింపిక్ గేమ్స్ అట్టహాసంగా జరుగుతున్నాయి. ఇప్పటికే వెయిట్లిఫ్టింగ్లో మీరాబాయి చాను రజత పతకం గెలవగా.. బాక్సర్ లవ్లీనా, బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు బంగారు పతకాల వేటలో ముందుకు సాగుతున్నారు. ఇదిలా ఉంటే.. వారం క్రితం టోక్యలో జరిగిన ఒలింపిక్ గేమ్స్ ప్రారంభోత్సవ వేడుకల్లో ఒక సంఘటనను గమనించారా? ఒలింపిక్ చరిత్రలో ఎన్నడూ లేనిది టోక్యో ఒలింపిక్ గేమ్స్ ప్రారంభానికి ముందు జపాన్ ప్రధాని నరుహిటో, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ( ఐవోసీ ) అధ్యక్షుడు థామస్ బచ్ సహా ఒలింపిక్ నిర్వాహకులు కొద్దిసేపు మౌనం పాటించారు. దాదాపు 50 ఏండ్ల క్రితం మ్యూనిచ్ ఒలింపిక్స్ సమయంలో అమరులైన పలువురు అథ్లెట్లకు నివాళులర్పించారు. అసలు మ్యూనిచ్ ఒలింపిక్స్ సమయంలో ఏమైంది? ఒలింపిక్ చరిత్రలోనే చీకటి రోజుగా చెప్పుకునేలా ఏం జరిగింది? గేమ్స్ సమయంలో మరణించిన క్రీడాకారులకు.. ఆ తర్వాత జరిగిన ఒలింపిక్స్లో కాకుండా దాదాపు అర్ధ శతాబ్దం తర్వాత తొలిసారిగా నివాళులు ఎందుకు అర్పించారు? ఈ విషయాలు ఒకసారి చూద్దాం..
49 ఏండ్ల క్రితం అంటే.. 1972లో ఒలింపిక్ గేమ్స్ జర్మనీలోని మ్యూనిచ్లో జరిగాయి. ప్రపంచ దేశాల అథ్లెట్లు అందరూ ఒలింపిక్ గ్రామానికి చేరుకున్నారు. పోటీలు కూడా ప్రారంభమయ్యాయి. అది సెప్టెంబర్ 5.. అథ్లెట్లు ఇతర సిబ్బంది మాత్రమే ఉండే ఆ ప్రాంతానికి పాలస్తీనాకు చెందిన కొంతమంది ఉగ్రవాదులు చొరబడ్డారు. వచ్చి రాగానే ఇజ్రాయెల్కు చెందిన 11 మంది సభ్యుల జట్టును అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఇద్దరిని అక్కడికక్కడే కాల్చి చంపేశారు. మిగతా 9 మందిని బందీలుగా చేసుకున్నారు. 200 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తేనే వారిని వదులుతామని డిమాండ్ చేశారు. అయితే అథ్లెట్లు వారి చేతిలో బందీలుగా ఉండటంతో రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి జర్మన్ పోలీసు విభాగాలు సాహసించలేకపోయాయి. ఈ క్రమంలో తొమ్మిది మంది అథ్లెట్లతో పాటు ఉగ్రవాదులు స్థానిక ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అక్కడ రెస్క్యూ ఆపరేషన్కు జర్మన్ పోలీసులు ప్రయత్నించారు. పోలీసుల కాల్పులతో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. బందీలుగా ఉన్న తొమ్మిది మంది క్రీడాకారులను దారుణంగా హత్య చేశారు. దీంతో ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చారు. ఈ కాల్పుల్లో ఓ జర్మన్ పోలీసు కూడా మరణించాడు.
ఉగ్రవాదుల దాడితో కొన్ని గంటల పాటు క్రీడా పోటీలు నిలిచిపోయాయి. అథ్లెట్లను హతమార్చిన ఉగ్రవాదుల్లో కొంతమంది కాల్పుల్లో మరణించడంతో పాటు మిగిలిన ఉగ్రవాదులు పోలీసులకు చిక్కడంతో ఒలింపిక్ గేమ్స్ కొనసాగించాలని అప్పటి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు ఎవెరీ బ్రండేజ్ నిర్ణయించారు. ఈ ఆటలను ఆపేయాలని పలువురు ఆందోళన చేసినప్పటికీ.. ఒలింపిక్ నిర్వాహకులు పట్టించుకోలేదు. స్టేడియంలో సంస్మరణ సభ ఏర్పాటు చేసి మృతిచెందిన అథ్లెట్లకు సంతాపం తెలిపారు. దాదాపు 34 గంటల విరామం తర్వాత పోటీలను ప్రారంభించారు. ఈ సంఘటన జరిగినప్పటి నుంచి ఒలింపిక్ గేమ్స్ జరిగే చోట భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.
మ్యూనిచ్ ఒలింపిక్స్ సమయంలో మరణించిన అథ్లెట్లకు.. ఒలింపిక్ గేమ్స్ ప్రారంభోత్సవ వేడుకల్లో నివాళులు అర్పించాలని మృతుల కుటుంసభ్యులు ఎన్నో ఏళ్లుగా కోరుతున్నారు. కానీ వారి విన్నపాన్ని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ పట్టించుకోలేదు. ఈ సంఘటన గురించి తమకు ఏమీ పట్టి లేదన్నట్టుగా ఎన్నో ఒలింపిక్ గేమ్స్ను నిర్వహించింది. ఈ ఘటన జరిగి 40 ఏళ్లు అయిన సందర్భంగా 2012లో జరిగిన లండన్ ఒలింపిక్స్లో అయినా నివాళులర్పించాలని విజ్ఞప్తి చేశారు. కానీ ఐవోసీ అప్పుడు కూడా ఒప్పుకోలేదు. చివరకు 2016 రియో ఒలింపిక్స్ సమయంలో మాత్రం.. అమరులైన అథ్లెట్లకు నివాళులర్పించేందుకు ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేసింది. కానీ అధికారికంగా మాత్రం సంతాపం తెలపలేదు. ఇప్పుడు ఎట్టకేలకు టోక్యో ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలో వారిని స్మరించుకుని శ్రద్ధాంజలి ఘటించారు. దీనిపై అథ్లెట్ల కుటుంబీకులు సంతోషం వ్యక్తం చేశారు. ఇన్నేళ్లకు వారికి సముచిత గౌరవం దక్కిందని అభిప్రాయపడ్డారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
కష్టాలకు పంచ్లిస్తూ లవ్లీనా పతక ప్రయాణం
ఉగ్రవాది స్వర్ణం ఎలా గెలుస్తాడు?
Mary Kom: నా రింగ్ డ్రెస్ మార్చుకోమని ఎందుకు అడిగారు?
నేను చచ్చిపోతే.. ఎవరిది బాధ్యత