గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనే సీఎం కేసీఆర్ లక్ష్యం
హరితహారంతో పల్లెల్లో పచ్చదనం
వేల్పూర్, భీమ్గల్లో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి
పాల్గొన్న కలెక్టర్ నారాయణరెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా
వేల్పూర్/ భీమ్గల్, జూలై 1: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి సాధిస్తున్నాయని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహనిర్మాణ,శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన వేల్పూర్ మండల కేంద్రంతో పల్లె ప్రగతి, భీమ్గల్ మండల కేంద్రంలో పట్టణ ప్రగతి కార్యక్రమాలను కలెక్టర్ నారాయణరెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తాతో కలిసి ప్రారంభించారు. భీమ్గల్లోని బాపూజీనగర్ ప్రధాన రహదారి వెంట మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వేల్పూర్, భీమ్గల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ.. పల్లెలను అభివృద్ధి చేయాలనే కేసీఆర్ ఆలోచన నుంచి పుట్టిందే పల్లె ప్రగతి కార్యక్రమమని తెలిపారు. ఇది ఓట్ల కోసం చేపట్టిన కార్యక్రమం కాదన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతి పంచాయతీకి కేంద్ర నిధులతో సమానంగా నిధులు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. ఉపాధి హామీ పథకాన్ని అభివృద్ధి కోసం సమర్థవంతంగా వినియోగిస్తున్నట్లు తెలిపారు. హరితహారం కార్యక్రమంతో గ్రామాల్లో పచ్చదనం సంతరించుకుంటున్నదని పేర్కొన్నారు. జిల్లాలో ఉత్తమ జీపీగా వేల్పూర్ నిలువడంపై సంతోషం వ్యక్తం చేసి, ప్రజాప్రతినిధులు, అధికారులను అభినందించారు. మహిళలకు వారికి కావాల్సిన మొక్కలను అందజేయాలని అధికారులను ఆదేశించారు. భీమ్గల్ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. పట్టణంలో సెంట్రల్ లైటింగ్, రోడ్డు నిర్మాణ పనులు త్వరలో ప్రారంభించనున్నట్లు చెప్పారు.
ప్రజల భాగస్వామ్యం ముఖ్యం..