వేములవాడ టౌన్/మల్యాల/ఇల్లందకుంట, ఏప్రిల్ 21 : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలు ఆలయాల్లో బుధవారం రాములోరి కల్యాణం కనులపండువగా జరిగింది. వేములవాడ పార్వతీ రాజరాజేశ్వర స్వామి, కొండగట్టు ఆంజనేయ స్వామి, ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాల్లో ఆంతరంగికంగానే దివ్య ఘట్టాన్ని జరిపించారు. రాజన్న ఆలయంలో అందంగా అలంకరించిన వేదికపై శ్రీసీతాసమేత రామచంద్రమూర్తిని ఆసీనుల చేసి పట్టు వస్ర్తాలు, ఆభరణాలు ధరింపజేశారు. ఉదయం 10.50 గంటల నుంచి 12.45 వరకు అభిజిత్ లగ్నంలో శాస్ర్తోక్తంగా కల్యాణ తంతు నిర్వహించారు. రాజన్న ఆలయం తరఫున ఈవో కృష్ణప్రసాద్, ఏఈవో హరికిషన్ స్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. మున్సిపాలిటీ తరపున చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, రాజు, కమిషనర్ శ్యాంసుందర్రావ్ పట్టువస్త్రాలను అందజేశారు. ఆలయ ప్రధానార్చకులు నమిలకొండ ఉమేశ్శర్మ ఆధ్వర్యంలో ఆచార్యదంపతులుగా వ్యవహరించిన మరంగంటి గిరిధరాచార్యులు-మాధవి దంపతులు, అర్చక బృందం కల్యాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయప్రాంగణంలోని రామాలయంలో కొవిడ్ నిబంధనలమేరకు కొంతమంది అర్చకులు, అధికారుల మధ్యనే ఈ కల్యాణాన్ని నిర్వహించారు . కల్యాణం జరుగుతున్నంతసేపు మెట్లవద్ద శివపార్వతులు కొంతమంది ఒకరిపై ఒకరు అక్షింతలు పోసుకున్నారు.
ఇల్లందకుంటలో..
అపర భద్రాద్రిగా పేరొందిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో సీతారాముల కల్యాణ వేడుక వైభవంగా జరిగింది. ఎదుర్కోళ్ల తర్వాత రామయ్యను పల్లకీలో మేళ తాళాలు, మంగళవాయిద్యాల మధ్య కల్యాణ వేదికకు తీసుకువచ్చారు. సీతారాముల కల్యాణానికి వైద్య, ఆరోగ్య శాఖమంత్రి ఈటల రాజేందర్ పట్టు వస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. కల్యాణాన్ని తిలకించారు. మంత్రి ఈటల మాట్లాడుతూ కొవిడ్ ఉధృతి దృష్ట్యా కల్యాణాన్ని దేవాలయ ఆవరణలోనే నిర్వహిస్తున్నామన్నారు. వచ్చే సంవత్సరం కల్యాణాన్ని వైభవంగా జరుపుకుందామన్నారు. వైరస్ లక్షణాలున్న వారు ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. స్వామి వారు ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ విజయ, దేవాలయ చైర్మన్ ఎక్కటి మధుసూదన్రెడ్డి, ఎంపీపీ సరిగొమ్ముల పావని, జమ్మికుంట ఎంపీపీ మమత, కేడీసీసీ జిల్లా ఉపాధ్యక్షుడు పింగిళి రమేశ్, దేవాలయ పర్యవేక్షులు బెల్సింగ్, ఆలయ ఈవో సుధాకర్, తహసీల్దార్ సురేఖ, జమ్మికుంట రూరల్ సీఐ విద్యాసాగర్, ఎస్ఐ ప్రవీణ్రాజ్, అర్చకులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.