న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో తనకు సులువైన ‘డ్రా’ ఎదురైనా.. విశ్వక్రీడల స్థాయిలో ఏ మ్యాచ్ కూడా అంత తేలిక కాదని.. ఇక్కడ ప్రతీ పాయింట్ ముఖ్యమే అని ప్రపంచ చాంపియన్ పీవీ సింధు చెప్పింది. రియో ఒలింపిక్స్ (2016)లో రజతం నెగ్గిన సింధు.. ఈ సారి పసిడి పతకం పట్టాలని పట్టుదలగా ఉంది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) విడుదల చేసిన టోక్యో ‘డ్రా’పై సింధు స్పందిస్తూ.. ‘ఒలింపిక్స్ స్థాయిలో ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు. అందరూ మంచి ఫామ్లో ఉంటారు. నేను కూడా అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తా. ఒక్కో మ్యాచ్ను దృష్టిలో పెట్టుకుంటూ ముందుకు సాగుతూ.. ఇక్కడ ప్రతీ పాయింట్ ముఖ్యమే.. ప్రతీ మ్యాచ్ గెలువాల్సిందే’ అని పేర్కొంది.