ముంబై: ఇండియన్ టీమ్ మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ ఇప్పటికే అన్ని ఫార్మాట్ల ఇంటర్నేషనల్ క్రికెట్కు గుడ్బై చెప్పేశాడు. ఇక మిగిలింది ఐపీఎల్ మాత్రమే. అందులోనూ అతనికి ఇదే చివరి సీజన్ కావచ్చన్న వార్తలు వస్తున్నాయి. అయితే చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ మాత్రం.. ధోనీకిదే చివరి సీజన్ కాదని అన్నారు. అతనికి ఇదే చివరి ఏడాది అని నాకు అనిపించడం లేదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. మేము ఇప్పటికిప్పుడు మరో ప్లేయర్ వైపైతే చూడటం లేదు అని ఆయన స్పష్టం చేశారు.
టీమ్లోని మరో ఇద్దరు ముఖ్యమైన ఆటగాళ్లు రైనా, జడేజా గురించి కూడా ఆయన స్పందించారు. జడేజా ఫిట్గా ఉన్నాడని ఎన్సీఏ చెప్పింది. ఇప్పటికే అతడు ప్రాక్టీస్ కోసం టీమ్తో చేరాడు. ఐపీఎల్ మొదలయ్యే లోపు అతడు పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడని అనుకుంటున్నాం అని కాశీ విశ్వనాథన్ చెప్పారు. అటు రైనా కూడా గత పది రోజులుగా తమ టీమ్తో ప్రాక్టీస్ చేస్తున్నాడని, ఈ సీజన్లో తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఆరాటపడుతున్నట్లు తెలిపారు.
ఇక పుజారాను చెన్నై ఎందుకు కొనుగోలు చేసిందో కూడా కాశీ విశ్వనాథన్ చెప్పుకొచ్చారు. మేము కూడా అతన్ని గౌరవించాలని అనుకున్నాం. అయితే అతనిలాంటి అద్భుతమైన టెక్నిక్ ఉన్న వ్యక్తి ఏ ఫార్మాట్కైనా తనను తాను మలచుకోగలడు. సీఎస్కేకు అతడు చాలా చేయగలడు. అందుకే మేము అతన్ని కొనుగోలు చేశాం. అయితే అతడు తొలి మ్యాచ్ ఆడతాడా, రెండో మ్యాచ్ ఆడతాడా మాత్రం చెప్పలేను అని ఆయన అన్నారు.