ముంబై, జూన్ 14:ఇటీవలికాలంలో జోరుగా పెరిగిన అదాని గ్రూప్ షేర్లు సోమవారం హఠాత్తుగా పెద్ద కుదుపునకు లోనయ్యాయి. ఆ గ్రూప్ కంపెనీల్లో వాటాలు కలిగిన విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్పీఐలు) ఖాతాల్ని నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ (ఎన్ఎస్డీఎల్) స్తంభింపచేసిందంటూ వెలువడిన వార్తలతో ఆ షేర్లు ఉదయం ట్రేడింగ్లో 25 శాతం వరకూ పడిపోయాయి. ట్రేడింగ్ మొదలైన గంటలో ఈ గ్రూప్ ఇన్వెస్టర్ల సంపద రూ.73,000 కోట్ల మేర హరించుకుపోయింది. అయితే తమ టాప్ షేర్హోల్డర్లయిన విదేశీ ఇన్వెస్టర్ల ఖాతాల్ని ఫ్రీజ్ చేయలేదంటూ రాతపూర్వక సమాచారం వచ్చిందని అదాని గ్రూప్ మధ్యాహ్న సమయంలో ఇచ్చిన వివరణతో పతనం నుంచి ఆ గ్రూప్ షేర్లు కొంతవరకూ కోలుకున్నాయి. అయినప్పటికీ గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అయిన అదాని ఎంటర్ప్రైజెస్ షేరు 8.36 శాతం నష్టంతో రూ.1,501 వద్ద ముగిసింది. ఈ షేరు ఉదయం ట్రేడింగ్లో 25 శాతం క్రాష్ అయ్యింది. అదాని పోర్ట్స్ షేరు 8.36 శాత నష్టంతో రూ.768 వద్ద క్లోజయ్యింది. ఈ షేరు ఒక దశలో 18.5 శాతం పతనమయ్యింది. ఇతర గ్రూప్ షేర్లయిన అదాని గ్రీన్ ఎనర్జీ 4 శాతం, అదాని టోటల్ గ్యాస్ 5 శాతం, అదాని ట్రాన్స్మిషన్ 5 శాతం, అదాని పవర్ 5 శాతం చొప్పున నష్టాలతో ముగిసాయి.
రూ.43,500 కోట్ల విలువైన షేర్లు ఈ ఎఫ్పీఐలవే
అల్బులా ఇన్వెస్ట్మెంట్ ఫండ్, క్రెస్టా ఫండ్, ఏపీఎంఎస్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అనే మూడు ఎఫ్పీఐల వద్ద రూ. 43,500 కోట్ల విలువైన అదాని గ్రూప్ కంపెనీల వాటాలున్నాయి. పోర్ట్లూయీస్లో ఒకే చిరునామాతో రిజిష్టరైన ఈ విదేశీ ఫండ్స్ వద్ద 6.8 శాతం అదాని ఎంటర్ప్రైజెస్, 8 శాతం అదాని ట్రాన్స్మిషన్, 6 శాతం అదాని టోటల్ గ్యాస్, 3.5 శాతం అదాని గ్రీన్ షేర్లు వున్నాయి. ఈ ఫండ్స్ యాజమానులు ఎవరనేది సరైన సమాచారం ఇవ్వని కారణంగా ఖాతాలను మే 31న ఫ్రీజ్ చేసినట్లు మీడియాలో వార్తలు వెలువడ్డాయి. దాంతో ఈ షేర్లు నిలువునా పతనమయ్యాయి.
ఫ్రీజ్ చేయలేదు – అదాని గ్రూప్
తమ షేర్లు కలిగిన ఫండ్స్ ఖాతాల్ని ఫ్రీజ్ చేసారన్న ప్రచారం నిరాధారమని, ఇన్వెస్టర్లను తప్పుదోవపట్టించడానికి ఇది జరిగిందని, దీంతో ఇన్వెస్టర్లకు ఆర్థికనష్టం, గ్రూప్ ప్రతిష్ఠకు దెబ్బతగులుతున్నదని అదాని గ్రూప్ కంపెనీలు విడివిడిగా స్టాక్ ఎక్సేంజీలకు తెలిపాయి. ఈ ఫండ్స్ డీమ్యాట్ ఖాతాలేవీ ఫ్రీజ్కాలేదంటూ జూన్ 14 తేదీన షేర్ల రిజిష్ర్టార్, ఎన్ఎస్డీఎల్ తమకు ఈ మెయిల్ చేసినట్లు ఆయా కంపెనీలు ఎక్సేంజ్లకు తెలిపాయి.
సుచేతా దలాల్ ట్వీట్ ట్రెండింగ్
అదాని గ్రూప్ షేర్ల పతనానికి కారణం ప్రముఖ బిజినెస్ జర్నలిస్ట్ సుచేతా దలాల్ అంటూ ట్విటర్లో మారుమోగిపోయింది. ఆవిడ చేసిన ట్వీట్ సోమవారం ట్విటర్లో జోరుగా ట్రెండ్ అయ్యింది. ‘ఓ గ్రూప్ షేర్లను రిగ్గింగ్చేస్తున్నారు. సెబి ట్రాకింగ్ సిస్టమ్స్ బ్లాక్బాక్స్ వెలుపల లభ్యమయ్యే సమాచారంతో ఈ కుంభకోణాన్ని వెలికితీసి నిరూపించడం కష్టం’ అంటూ చేసిన ట్వీట్.. అదాని గ్రూప్పై గురిపెట్టిందే అంటూ ట్విటర్ యూజర్లు రీట్వీట్ చేశారు.1992లో హర్షద్ మెహతా కుంభకోణాన్ని బాహ్య ప్రపంచానికి వెల్లడించిన ఘనత కలిగిన సుచేతా దలాల్ పద్మశ్రీ ఆవార్డు గ్రహీత.