వ్యూహాలు పన్నడంలో తలపండిన మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనీ ముందు యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ పప్పులుడకలేదు. టాస్ గెలువడంతోనే సగం మ్యాచ్ నెగ్గేసిన చెన్నై.. మహీ మెరుపులతో ఐపీఎల్ 14వ సీజన్ ఫైనల్కు దూసుకెళ్లింది. పనైపోయిందని విమర్శిస్తున్న వారి నోళ్లు మూయిస్తూ.. ధోనీ తనలోని అత్యుత్తమ ఫినిషర్ను మరోసారి ప్రపంచానికి చూపిస్తే.. యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, వెటరన్ ప్లేయర్ ఉతప్ప అర్ధశతకాలతో మెరిశారు. ఐపీఎల్ చరిత్రలోనే మరే జట్టుకు సాధ్యం కాని రీతిలో చెన్నై సూపర్ కింగ్స్ తొమ్మిదోసారి
ఫైనల్లో అడుగుపెట్టగా.. పంత్ సేన క్వాలిఫయర్-2పైనే ఆశలు పెట్టుకుంది!
దుబాయ్: ఉత్కంఠ పోరులో అనుభవానిదే పైచేయి అయింది. ఐపీఎల్ 14వ సీజన్ తొలి క్వాలిఫయర్లో ఢిల్లీ క్యాపిటల్స్ను చిత్తుచేసిన చెన్నై సూపర్ కింగ్స్ దర్జాగా ఫైనల్లో అడుగుపెట్టింది. లీగ్లో ధోనీసేన ఫైనల్ చేరడం ఇది తొమ్మిదోసారి కాగా.. కీలక సమయాల్లో ఒత్తిడికి లోనైన ఢిల్లీ పరాజయం వైపు నిలిచింది. అయితే పంత్ అండ్ కో ఫైనల్ చేరేందుకు క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం ఉండటం ఊరటనిచ్చే అంశం. సోమవారం బెంగళూరు, కోల్కతా మధ్య జరుగనున్న ఎలిమినేటర్ విజేతతో బుధవారం పంత్సేన తలపడనుంది. అందులో నెగ్గిన వారితో తుదిపోరులో ధోనీ సేన అమీతుమీ తేల్చుకోనుంది. లీగ్ దశలో చివరి మూడు మ్యాచ్ల్లో ఓటమి పాలైన చెన్నై సూపర్ కింగ్స్ గోడకు కొట్టిన బంతిలా తిరిగి వచ్చింది. నాకౌట్ మ్యాచ్ల్లో ఒత్తిడిని జయించడం బాగా తెలిసిన ధోనీ సేన ఆదివారం జరిగిన క్వాలిఫయర్-1లో 4 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ను చిత్తు చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 172 పరుగులు చేసింది. యువ ఓపెనర్ పృథ్వీషా (34 బంతుల్లో 60; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) దంచికొట్టగా.. రిషబ్ పంత్ (35 బంతుల్లో 51 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. శిఖర్ ధవన్ (7), శ్రేయస్ అయ్యర్ (1), అక్షర్ పటేల్ (10) విఫలం కాగా.. హెట్మైర్ (37) విలువైన పరుగులు జోడించాడు. చెన్నై బౌలర్లలో హజిల్వుడ్ రెండు, జడేజా, అలీ, బ్రావో తలా ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో చెన్నై 19.4 ఓవర్లలో 6 వికెట్లకు 173 పరుగులు చేసింది. యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (70; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), వెటరన్ ప్లేయర్ రాబిన్ ఉతప్ప (44 బంతుల్లో 63; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకాలతో ఆకట్టుకుంటే.. ప్రపంచ అత్యుత్తమ ఫినిషర్ మహేంద్రసింగ్ ధోనీ (6 బంతుల్లో 18 నాటౌట్; 3 ఫోర్లు, ఒక సిక్సర్) తనదైన శైలిలో మ్యాచ్ను ముగించాడు. ఢిల్లీ బౌలర్లలో టామ్ కరన్ మూడు వికెట్లు పడగొట్టగా.. గైక్వాడ్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది.
సంక్షిప్త స్కోర్లు
ఢిల్లీ: 20 ఓవర్లలో 172/5 (పృథ్వీషా 60, పంత్ 51 నాటౌట్; హజిల్వుడ్ 2/29), చెన్నై: 19.4 ఓవర్లలో 173/6 (గైక్వాడ్ 70, ఉతప్ప 63; టామ్ కరన్ 3/29).