ముంబై: ఇండియన్ టీమ్ ( Team India ) కెప్టెన్గా ఉన్న విరాట్ కోహ్లి టీ20 వరల్డ్కప్ తర్వాత పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నాడన్న వార్త సోమవారం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఓ ప్రముఖ పత్రిక దీనికి సంబంధించిన వార్తను ప్రచురించింది. కోహ్లి టెస్ట్ కెప్టెన్సీకే పరిమితమవుతాడని, వన్డేలు, టీ20ల్లో రోహిత్ శర్మ సారథ్యం వహిస్తాడన్నది ఆ వార్త సారాంశం. ఈ వార్తలను ఇప్పటికే బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ ఖండించగా.. తాజాగా కార్యదర్శి జే షా కూడా స్పందించారు. ఇండియన్ టీమ్ ప్రదర్శన బాగున్నంత వరకూ కెప్టెన్సీలో మార్పు ఉండబోదని షా స్పష్టం చేశారు.
నిజానికి మూడు ఫార్మాట్లలోనూ కోహ్లి కెప్టెన్సీలో టీమిండియా అద్భుతంగా రాణిస్తోంది. ఐసీసీ ట్రోఫీ గెలవలేకపోయాడన్న అపవాదు తప్ప ఇప్పటి వరకూ విరాట్ కెప్టెన్సీపై ఎలాంటి మరకా లేదు. అయితే మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ భారం వల్ల తన బ్యాటింగ్పై దృష్టి సారించలేకపోతున్నాడని, అందుకే పరిమిత ఓవర్ల క్రికెట్ వరకూ ఈ బాధ్యతల నుంచి తప్పుకోవాలని విరాట్ భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలను బీసీసీఐ ఖండించడంతో కెప్టెన్సీ మార్పుపై చర్చకు ఇక తెర పడినట్లే.