చెన్నై: టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ లేకుంటే.. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఫ్రాంచైజీ లేదని ఇండియా సిమెంట్స్ మేనేజింగ్ డైరెక్టర్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ పేర్కొన్నారు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 14వ సీజన్లో చెన్నై నాలుగో సారి ట్రోఫీ చేజిక్కించుకోగా.. తదుపరి సీజన్లో ధోనీ చెన్నైకి ప్రాతినిధ్యం వహిస్తాడా లేదా అనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీనిపై స్పందించిన యాజమాన్యం తొలి రిటెన్షన్ కార్డ్ను మహీ కోసమే వినియోగిస్తామని స్పష్టం చేయగా.. తాజాగా శ్రీనివాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ధోనీ లేకుంటే చెన్నై సూపర్ కింగ్స్ లేదు. ధోనీ సీఎస్కేలోనే కాదు, చెన్నైలో, తమిళనాడులో ఓ భాగం. ప్రస్తుతం అతడు టీమ్ఇండియా మెంటార్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. యూఏఈ నుంచి తిరిగి వచ్చాక మేము సంబురాలు జరుపుకుంటాం’ అని సోమవారం శ్రీనివాసన్ పేర్కొన్నారు.