శ్రీనగర్: దేశవ్యాప్తంగా బుధవారం రంజాన్ మాసం ప్రారంభమయ్యింది. దీంతో జమ్ముకశ్మీర్లో కరోనా వ్యాక్సిన్ తీసుకునేవారి సంఖ్య 50 శాతం తగ్గిపోయింది. రోజా చేస్తుండగా టీకా తీసుకుంటే ఉపవాస దీక్షకు భంగం కలుగుందని ప్రజలు అనుకుంటుండంతో వ్యాక్సినేషన్ కేంద్రాలకు వచ్చేవారి సంఖ్య భారీగా తగ్గిందని అధికారులు వెల్లడించారు. రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మంచి నీరుకూడా తాగకుండా కఠిన ఉపవాస దీక్ష చేస్తారన్న విషయం తెలిసిందే. దీంతో బుధవారం వ్యాక్సిన్ తీసుకునేవారి సంఖ్య ఘననీయంగా తగ్గిందని వెల్లడించారు. జమ్ముకశ్మీర్లో మంగళవారం 65 వేల మందికిపైగా వ్యాక్సిన్ తీసుకోగా, నిన్న 31 వేల మంది మాత్రమే టీకా వేయించుకున్నారని తెలిపారు.
కాగా, వ్యాక్సిన్ తీసుకుంటే ఉపవాసానికి భంగం వాటిల్లినట్లు కాదనే విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని కుటుంబ సంక్షేమశాఖ డీజీ డాక్టర్ సలీమ్ రెహమాన్ వెల్లడించారు. ఇప్పటికే ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో మతపెద్దలు ఈ విషయంలో ఫత్వాలు జారీచేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఉపవాసదీక్ష చేస్తున్నవారు సైతం కొవిడ్ టీకా తీసుకోవచ్చని జమ్ముకశ్మీర్ గ్రాండ్ ముఫ్తీ నసీర్ ఉల్ ఇస్లామ్ వెల్లడించారు. ఉపవాసానికి వ్యాక్సిన్ ఎలాంటి భంగం కలిగించదని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..