ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్(WTC) ఫైనల్ ఈ ఏడాది జూన్ 18 నుంచి 22 వరకు బ్రిటన్లోని సౌతాంప్టన్లో జరగనుంది. ఆరంభ టెస్టు చాంపియన్షిప్ ట్రోఫీ కోసం భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. భారత్లో కరోనా ఉద్ధృతి తీవ్రస్థాయిలో ఉండటంతో ఇండియా నుంచి రాకపోకలపై బ్రిటీష్ ప్రభుత్వం నిషేధం విధిస్తూ రెడ్ లిస్ట్లో చేర్చింది. ఐతే ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే WTC ఫైనల్ జరుగుతుందని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) పేర్కొంది.
అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లను సురక్షితంగా ఎలా నిర్వహించాలో ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ఇప్పటికే విజయవంతంగా నిర్వహించిందని, డబ్ల్యూటీసీ ఫైనల్ ఎలాంటి అవాంతరాలు లేకుండా జరుగుతుందని ఐసీసీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. కోవిడ్-19 కారణంగా చాంపియన్షిప్ ఫైనల్ను బయో సెక్యూర్ బబుల్లో నిర్వహించనున్నారు.