హైదరాబాద్: ఇంగ్లండ్తో ఓవల్లో జరిగిన నాలుగవ టెస్ట్లో కోహ్లీసేన అద్భుత విజయాన్ని నమోదు చేసిన విజయం తెలిసిందే. ఆ మ్యాచ్లో ఇండియన్ ఆటగాళ్లు అమోఘమైన ప్రదర్శన ఇచ్చినట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపారు. మ్యాచ్ ముగిసిన తర్వాత తన ట్విట్టర్లో గంగూలీ రియాక్ట్ అయ్యారు. రెండు జట్ల ఆటగాళ్ల మధ్య నైపుణ్యంలో తేడా ఉందని, కానీ అతిపెద్ద తేడా ఒత్తిడిని జయించడంలో ఉంటుందని, ఆ అంశంలో భారత క్రికెటర్లు ఎన్నో రేట్లు మెరుగైన స్థానంలో ఉన్నట్లు గంగూలీ తెలిపారు. రసవత్తరంగా సాగిన మ్యాచ్లో చివరి రోజున ఇంగ్లండ్ 210 రన్స్ ఆలౌటైంది. ఈ మ్యాచ్ను 157 పరుగుల భారీ తేడాతో భారత్ సొంతం చేసుకుంది. దీంతో సిరీస్లో 2-1 ఆధిక్యాన్ని సాధించింది.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా తన ట్విట్టర్లో ఓవల్పై మ్యాచ్పై కామెంట్ చేశారు. భారత్ మ్యాచ్పై పట్టు సాధించిన తీరు అమోఘమన్నారు. వికెట్ నష్టపోకుండా 77 రన్స్తో ఉన్న ఇంగ్లండ్ను ఓడించడం అద్భుతమని సచిన్ తెలిపారు. సిరీస్ను 3-1 తేడాతో సొంతం చేసుకోవాలని సచిన్ అభిప్రాయపడ్డారు. ఓటమి నుంచి తేరుకుని మళ్లీ వరుస విజయాలను నమోదు చేస్తున్న జట్టునే టీమిండియా అంటారని వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశారు. భారత జట్టు పట్ల గర్వంగా ఉందని మాజీ క్రికెటర్ తెలిపారు.