సిద్దిపేట జోన్/ సిద్దిపేట అర్బన్, మే 1 : మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం పోలింగ్ ముగియడంతో బ్యాలెట్ బాక్సులను ఇందూర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్కు తరలించారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య బ్యాలెట్ బాక్సులను భద్రపర్చారు. కౌంటింగ్ ఏర్పాట్లను అదనపు కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ పరిశీలించారు. ఇందూర్ ఇంజినీరింగ్ కళాశాలలో డి- బ్లాక్లో ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఇందుకోసం గ్రౌండ్ ఫ్లోర్లో ఓట్ల లెక్కింపునకు అవసరమైన టేబుళ్లను ఏర్పాటు చేశారు. మొత్తం 14 టేబుళ్లలో ఓట్ల లెక్కింపు జరగనున్నది. ప్రతి టేబుల్కు 3 వార్డుల చొప్పున ఓట్లను లెక్కించనున్నారు. బ్యాలెట్ బాక్సులు భద్రపర్చిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.
కరోనా పరీక్షలు ..
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 3న చేపట్టనున్న ఓట్ల లెక్కింపునకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. కరోనా విజృంభిస్తున్న వేళ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశానుసారం ఓట్ల లెక్కింపులో పాల్గొనే సిబ్బందికి, రాజకీయ పార్టీల ఏజెంట్లకు, జర్నలిస్టులకు ఇందూర్ కళాశాలలో కరోనా టెస్టులు నిర్వహించారు. కరోనా నెగెటివ్ రిపోర్టు, సెలక్షన్ కౌంటింగ్ పాసులు ఉన్న వ్యక్తులను మాత్రమే లోనికి అనుమతించనున్నారు. ఓట్ల లెక్కింపును కట్టుదిట్టంగా చేపట్టనున్నారు. ఈ మేరకు అదనపు కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ ఏర్పాట్లు పర్యవేక్షించారు.