కరోనా సోకిన వ్యక్తులను ఇంట్లోంచి తరుముతున్న రోజులు ఇవి. ఒక అభద్రతా భావం, భయానక వాతావరణంలో అయిన వారే పట్టించుకునే పరిస్థితులు లేవు. ఇలా కొవిడ్ సంక్రమించిన వారిని ఎవరు చేరదీయాలి? వారి ఆలనా పాలనా ఎలా? లాంటి ప్రశ్నలు నలుగురు ఐటీ ఉద్యోగులకు ఎదురయ్యాయి. దీంతో వారు కొవిడ్ పేషెంట్లకు ఏదైనా సాయం అందించాలని పూనుకున్నారు. నలుగురు తమ జీతాల్లోంచి నెలకు కొంత వెచ్చించి ఆ పేషెంట్లకు తమ ఇంట్లోనే వండిన ఆహారాన్ని తాజాగా అందిస్తున్నారు. రోజుకు 185 మందికి ఆహారం అందిస్తున్నారు. ఫోన్ చేస్తే ఇంటికే భోజనం తెచ్చిస్తున్నారు. రెండు పూటలా భోజనం అందిస్తున్నారు. వారి జీతం పెద్ద మొత్తంలో వెచ్చించినా సరిపడటం లేదని తెలుస్తోంది. వారి సేవలు.. ఆ వివరాలేంటో చూద్దాం..!
సాధారణంగా ఐటీ ఉద్యోగులు అనగానే వీకెండ్ సరదాలు.. స్నేహితులతో లాంగ్ టూర్స్.. కంప్యూటర్లతో కుస్తీలు.. ప్రాజెక్టుల్లో బిజీగా గడపడం.. లాంటివే గుర్తొస్తాయి. అయితే, కష్టమొస్తే ఆదుకునే వారిలో కూడా ఐటీ ఉద్యోగులు ముందు వరుసలోనే ఉంటారు. వర్క్ బిజీ ఉన్నప్పటికీ సమయం దక్కించుకుని సాయం అందిస్తుంటారు. ప్రస్తుతం, కొవిడ్ కష్టకాలంలో సాఫ్ట్వేర్స్ దన్నుగా నిలుస్తున్నారు. తమ వంతు బాధ్యత నిర్వర్తిస్తూ ఆదర్శంగా ఉంటున్నారు.
ఫోన్ చేస్తే చాలు కొవిడ్ పేషెంట్లకు ఆహారాన్ని అందిస్తున్నారు. కరోనా కష్టతర పరిస్థితుల్లో ఐటీ ఉద్యోగులు మేమున్నామంటూ భరోసానిస్తున్నారు. ఓ వైపు వర్క్ ఫం హోం.. మరోవైపు కొవిడ్ సేవలు అందిస్తూ నిరుపేదలకు అండగా నిలుస్తున్నారు. గ్రేటర్ వ్యాప్తంగా ఈ సేవలు అందుతున్నాయి. కొవిడ్తో బాధపడే వారికి మధ్యాహ్నం భోజనం, నైట్ డిన్నర్ పంపిస్తూ అతిథులుగా మారుతున్నారు. కొవిడ్ క్లిష్ట సమయంలో ఒకరికి ఒకరూ అండగా నిలిచి మహమ్మారిని అంతమొందించాలని ఉద్యోగులు చెబుతున్నారు.
కొవిడ్ పేషెంట్లకు అండగా నిలుస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు
ఇంట్లో వండిన భోజనం సరఫరా
మధ్యాహ్నం, రాత్రి భోజనం పంపిణీ
రోజుకు 185 మందికి ఆహారం
ఆపత్కాలంలో ఆదర్శవంతంగా సేవలు
కాల్ చేస్తే చాలు ఇంటికే భోజనం
డయల్ నంబర్లు: 88866 86000, 81799 59990, 81431 43645
‘భార్గవ్, ఉమా మహేశ్వరీ, సాయి చందు, ప్రదీప్ రేనికుంట్ల’ ఐటీ ఉద్యోగులు. వివిధ కంపెనీల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. వారి స్నేహితులతో గ్రూప్గా ఏర్పడి కొవిడ్ సేవలందించాలని నిర్ణయించుకున్నారు. అందుకు గ్రేటర్ వ్యాప్తంగా వలెంటీర్లను ఏర్పాటు చేసుకున్నారు. ఇంట్లోనే భోజనం తయారు చేసి పార్సిళ్లను వలెంటర్లీకు అందిస్తారు. వారంతా బాధితులకు చేరుస్తారు. 88866 86000, 81799 59990, 81431 43645 నెంబర్లకు ఫోన్ చేసి అడ్రస్ చెబితే చాలు ఇంటి వద్దకు భోజనం వస్తుంది. ప్రతిరోజు 180 మందికి ఆహారాన్ని అందిస్తున్నారు.
వారం రోజుల నుంచి ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. వారికి వచ్చే జీతం నుంచి ఈ సేవా కార్యక్రమాలు చేయడం విశేషం. అయితే, రోజుకు చాలా ఫోన్ కాల్స్ వస్తుండటంతో చేయుతనివ్వడానికి ఎవ్వరైనా తమతో కలిసిరావాలని పిలుపునిస్తున్నారు. కరోనా సమయంలో సమయానికి ఆహారం తినడం చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలోనే వారు అవసరమైన వారికి ఆహారాన్ని అందించి అండగా నిలుస్తున్నారు.
కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం మన బాధ్యత. తోచినంత సాయం అందించాలి. మేం ఇంట్లోనే భోజనం తయారు చేసి కొవిడ్ పేషెంట్లకు పంపిస్తున్నాం. పప్పు, కూర, సరిపడా అన్నం, మజ్జిగ ఇలా మధ్యాహ్నం, రాత్రి పంపిస్తున్నాం. ఈ సమయంలో మనం కొవిడ్ పేషెంట్లకు అండగా నిలవాలి. వారికి ధైర్యాన్నివ్వాలి. చాలా కాల్స్ వస్తున్నాయి. వీలైనంత వరకు అందరికి ఆహారం అందేల చూస్తున్నాం. మా సేవలను మరింతగా పెంచాల్సిన సమయం ఇది. – ఉమా మహేశ్వరీ, ఐటీ ఉద్యోగి
కొవిడ్ పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కరోనా పాజిటివ్ వస్తే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి ఆహారం తీసుకోవాలి. చాలా మంది నిరుపేదలు సరైన సమయానికి ఆహారం తీసుకోకుండా వ్యాధిని జఠిలం చేస్తారు. ఇలా ఆహారం సమకూర్చుకోలేని వారికి అండగా నిలవాలనేదే మా లక్ష్యం. ఈ ఆపత్కాలంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకంగా తమవంతుగా సాయం అందించాలి. – ప్రదీప్, ఐటీ ఉద్యోగి