సుదీర్ఘ టెస్టు సమరానికి టీమ్ఇండియా సిద్ధమైంది. తొలి ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ఓటమిని మరిచి ఇంగ్లిష్ గడ్డపై సత్తాచాటాలని కసిగా ఉంది. ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా బుధవారం ఇక్కడ భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి మ్యాచ్ మొదలుకానుంది. ఈ పోరుతోనే డబ్ల్యూటీసీ రెండో ఎడిషన్ను భారత్ ప్రారంభించనుంది. 2018 సిరీస్లో ఇంగ్లండ్ గడ్డపై 1-4తో ఎదురైన ఓటమికి ఈ సిరీస్తో పగ తీర్చుకోవాలని కోహ్లీ సేన పట్టుదలతో ఉంది.
నాటింగ్హామ్: ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు టీమ్ఇండియా సమాయత్తమైంది. ఓపెనర్లు మయాంక్, శుభ్మన్ గాయాల పాలవడంతో జట్టు కూర్పు విషయంలో భారత్ మల్లగుల్లాలు పడుతున్నది. రోహిత్ శర్మతో పాటు రాహుల్ ఓపెనింగ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2018లో ఇంగ్లండ్పై రాహుల్ శతకం చేయడం సానుకూలంగా మారింది. కాగా కివీస్తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో పరిస్థితులను పట్టించుకోకుండా రెండు రోజుల ముందే జట్టును ఎంచుకున్న కోహ్లీ.. ఈసారి ఆచితూచి అడుగు వేయాలని భావిస్తున్నాడు. పుజార ఫామ్ను అందిపుచ్చుకోవాల్సి ఉండగా.. చాలా రోజులుగా కోహ్లీ బ్యాట్ నుంచి భారీ ఇన్నింగ్స్ రాలేదు. ఆస్ట్రేలియా పర్యటనలో దుమ్మరేపిన పంత్పై భారీ అంచనాలు ఉండగా.. జడేజా, అశ్విన్, ఇషాంత్, షమీ, బుమ్రా, సిరాజ్తో మన బౌలింగ్ బలంగా కనిపిస్తున్నది. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ జోరుకు కళ్లెం వేస్తే భారత్కు మంచి అవకాశాలు ఉంటాయి. కాగా ఈ సిరీస్ ప్రేక్షకుల మధ్యే జరుగనుంది.
భారత్: రోహిత్ శర్మ, రాహుల్/ అభిమన్యు ఈశ్వరన్, పుజార, కోహ్లీ (కెప్టెన్), రహానే, పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అశ్విన్, ఇషాంత్, షమీ, బుమ్రా
ఇంగ్లండ్: రోరి బర్న్స్, డామ్ సిబ్లే, జాక్ క్రాలీ, రూట్ (కెప్టెన్), ఓలీ పోప్, జాస్ బట్లర్, సామ్ కరన్, ఓలీ రాబిన్సన్, బ్రాడ్, జాక్ లీచ్, ఆండర్సన్