దేశంలోని క్రీడా సంఘాలకు అరుదుగా తెలుగువాళ్లు ప్రాతినిథ్యం వహిస్తూ ఉంటారు. ఇప్పటివరకు ఎక్కువగా ఉత్తరాది వారే దేశంలోని ప్రముఖ క్రీడా సంఘాలపై అజామాయిషీ చేస్తుండేవారు. కానీ ఇప్పుడు తెలుగు వారు కూడా దేశంలోని వివిధ క్రీడా సంఘాలపై పట్టు సాధిస్తున్నారు. ఇప్పుడు తాజాగా భారత ఒలింపిక్ సంఘం ఎన్నికల్లో అత్యున్నత స్థానానికి ఒక తెలుగు వ్యక్తి పోటీపడుతున్నారు. ఆయనే అరిశనపల్లి జగన్మోహన్ రావు ( Jagan Mohan Rao Arishnapally ). ప్రస్తుతం ఈయన హ్యాండ్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ( HFI ) ప్రెసిడెంట్గా ఉన్నారు.
హ్యాండ్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ( HFI ) అభివృద్ధి కోసం జగన్మోహన్ రావు ఎంతగానో కృషి చేశారు. ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి ఎందరో క్రీడాకారులను వెలుగులోకి తీసుకొచ్చారు. క్రీడాకారుల అభ్యున్నతి కోసం కృషి చేయడంతో అనతికాలంలోనే జగన్మోహన్ రావు జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. సాధారణంగా ఒక దక్షిణాది ప్రాంతానికి చెందిన వ్యక్తిని క్రీడాసంఘాల్లో అత్యున్నత స్థాయిలో ఉంటున్నారంటే ఉత్తరాది వారు సహించరు. కానీ జగన్మోహన్ రావు ఆ అవాంతరాలు అన్నింటినీ దాటుకుని ఇప్పుడు జాతీయ క్రీడా సంఘాల్లో తనదైన ముద్ర కనబరిచారు. అందుకే దేశంలోని హ్యాండ్ బాల్ ఫెడరేషన్కు అంతకుముందు లేని ప్రత్యేకమైన గుర్తింపు ఇప్పుడు లభించింది. ఈ విశేషమైన కృషి వల్లే ఇప్పుడు జగన్మోహన్ ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్ ఎన్నికల్లో ముందువరసలో ఉన్నారు. త్వరలో రాబోయే భారత ఒలంపిక్ సంఘం ఎన్నికల్లో జగన్ మోహన్ రావు అత్యున్నత స్థానానికి పోటీ పడబోతున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల లక్నోలో జరిగిన హ్యాండ్ బాల్ ఫెడరేషన్ జాతీయ సమావేశానికి సంఘం అధ్యక్షుడు అరిశనపల్లి జగన్మోహన్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు హ్యాండ్బాల్ క్రీడాకారులకు ఎంతో ప్రోత్సాహం అందించామని.. భవిష్యత్తులో కూడా ఇలాగే ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు.