హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ యువ చెస్ ప్లేయర్ సంహిత పుంగవనమ్ మళ్లీ మెరిసింది. జాతీయ బాలికల ఆన్లైన్ అండర్-8 ఓపెన్ చెస్ చాంపియన్షిప్లో సంహిత రజత పతకంతో ఆకట్టుకుంది. మొత్తం 145 మందికి పైగా ప్లేయర్లు పోటీపడ్డ టోర్నీలో సంహిత 11 రౌండ్లలో తొమ్మిది పాయింట్లు ఖాతాలో వేసుకుంది. రెండు గేములు చేజార్చుకున్నా తన కంటే వయసులో పెద్దవాళ్లను ఓడించి ఔరా అనిపించుకుంది. టోర్నీలో రెండో స్థానంలో నిలువడం ద్వారా వచ్చే నెలలో జరిగే ఆసియా యూత్ అండర్-8 చెస్ టోర్నీకి ఈ తెలంగాణ తేజం ఎంపికైంది. ఈ మధ్యే ఆసియా అండర్-7 విభాగంలో సంహిత రజతంతో మెరిసిన సంగతి తెలిసిందే.