హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ తొలి అండర్-23 అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో యువ స్ప్రింటర్ జివాంజీ దీప్తి స్వర్ణ పతకంతో మెరిసింది. శనివారం గచ్చిబౌలి స్టేడియం వేదికగా మొదలైన టోర్నీ మహిళల 200మీటర్ల రేసులో వరంగల్కు చెందిన దీప్తి 24.5 సెకన్లతో పసిడి పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. హారికాదేవి (నారాయణపేట), నిత్య.. వరుసగా రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. మహిళల 800మీటర్ల రేసులో నాగర్కర్నూల్కు చెంది న దొంతు భాగ్యలక్ష్మి(2.25.8సె) స్వర్ణంతో మెరువగా, షాట్పుట్లో హిమసింధు(8.23మీ) పసిడి ఖాతాలో వేసుకుంది.
అంతకుముందు అథ్లెటిక్స్ దిగ్గజం జేవియర్ స్మారకార్థం హైదరాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన టోర్నీ ని సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్లో మరింత మంది రాష్ట్రం నుంచి అథ్లెటిక్స్లో బరిలోకి దిగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. వరంగల్, ఉస్మానియా యూనివర్సిటీలో కొత్త సింథటిక్ ట్రాక్లతో పాటు మెదక్, కరీంనగర్, మహబూబ్నగర్, ఖమ్మం లాంటి పట్టణాల్లో ట్రాక్లు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సారంగపాణి, జాతీయ అథ్లెటిక్స్ టెక్నికల్ కమిటీ చైర్మన్ స్టాన్లీ జోన్స్, కోచ్ నాగపురి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.